ఈ నెల 26 న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో గల గుమస్తా కాలనీ వద్ద జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శ్వేతారెడ్డి హత్యలకు సంబందించిన వివరాలు వెల్లడించారు.
జిల్లా కేంద్రంలో దేవి ఏజెన్సీలో పని చేసే 19 సవత్సరాల విజ్ఞేష్ అనే కుర్రాడు ఈ హత్యలకు పాల్పడినట్టు ఎస్పీ తెలిపారు. నిందితుడు గతంలో రెండు ఎటిఎంలలో చోరీకి విఫలయత్నం చేశాడని తెలిపారు.
హత్యకు గురైన ఆర్ఎంపీ వైద్యుడు సుధాకర్ కు విజ్ఞేష్ పరిచయం కావడంతో అతని వద్ద డబ్బులు కాజేయాలని గోల్డ్ చైన్ కొనుక్కోవడానికి డబ్బులు కావాలని సుధాకర్ ను అడగడంతో సరే అన్నాడు.
హత్యలు జరిగిన రోజు డబ్బులు తీసుకొమ్మని సుధాకర్ ఫోన్ చేయగా సాయంత్రం మందు తాగుదామని అప్పుడు తీసుకుంటానని చెప్పిన విజ్ఞేష్ సాయంత్రం మందు, కల్లు తీసుకుని గుమస్తా కాలని వద్దకు వెళ్ళాడు.
ముందు వేసుకున్న పథకం ప్రకారమే….
ఎప్పుడు సుధాకర్ వెంట ఉండే లక్ష్మయ్య కూడా ఆరోజు అక్కడే ఉన్నాడు. అయితే సుధాకర్ కు చూపించడానికి నకిలీ చైన్ తీసుకెళ్లిన విజ్ఞేష్ గోల్డ్ చైన్ అని నమ్మకపోతే సుధాకర్ ను చంపడం కోసం ముందుగానే ఓ బ్యాగులో షటిల్ బ్యాట్, గొడ్డలి తీసుకెళ్లాడు. సుధాకర్ చైన్ చూసి గుర్తు పట్టే లోపు వెంట తెచ్చుకున్న గొడ్డలితో లక్ష్మయ్య తలపై నరికాడు.
ఆ సమయంలో పారిపోవడానికి ప్రయత్నించిన సుధాకర్ ను వెంబడించి నరికి చంపాడు విజ్ఞేష్.. అయితే సెల్ ఫోన్ డేటా ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు. నిందితుడిని రిమాండుకు పంపిస్తామన్నారు. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.