ఏళ్ల తరబడి రైతుల భూ సమస్యలను పరిష్కరించకుండా, రైతు బందు పథకం వచ్చినా దానిని రైతాంగం అనుభవంలోకి తీసుకురాకుండా, వారికి రైతు బందు పట్టాలు ఇవ్వకుండా అధికారులు అన్యాయం చేస్తున్నారని ప్రజాపోరాట సమితి (పీఆర్పీఎస్) నూనె వెంకట్ స్వామి అన్నారు.
ఈ రోజు వివిధ భూ సమస్యలు పరిష్కారం చేయాలని నల్గొండ జిల్లా చిట్యాల రెవెన్యూ కార్యాలయం ముందు రైతాంగంతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజమైన రైతులకు రైతు బందు ఆర్థిక సహకారాన్ని అందకుండా, రెవెన్యూ శాఖ తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
తహశీల్దారు నుండి వీఆర్ఏ వరకు సాచివేత ధోరణితో ఉన్నారని తమ భూ సమస్యలు చెప్పే రైతాంగాన్ని పురుగుల్లాగా చీమల్లాగా చూస్తున్నారని వారి ఆత్మకు గౌరవాన్ని ఇవ్వడం లేదని వెంకట్ స్వామి అన్నారు. దీంతో రైతాంగం చెప్పులు అరిగే విధంగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి ఒకే సమస్యపై పలుమార్లు వ్యక్తిగత దరఖాస్తులు పెట్టుకోవాల్సి వస్తోందని అన్నారు.
కింది స్థాయి నుంచి పై వరకూ రైతుల గోడు పట్టించుకోవడం లేదు
క్రింది స్థాయిలో సమస్య పరిష్కారం కావట్లేదని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో వరకు పిటిషన్ల నిస్తూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ వెళ్తున్నారని ఆయన అన్నారు. భూ సమస్యలున్నా రైతాంగం భూములను కొలవడంలో భూ సర్వేయర్లు నిమ్మకు నీరెత్తినట్టుగా మారారని రైతాంగం తమ గోడును వినిపిస్తూ విలవిలలాడుతున్నారని అయినా రెవెన్యూ సిబ్బందికి రైతాంగంపై కనికరం ఉండట్లేదని ప్రజాపోరాట సమితి (పీఆర్పీఎస్) నూనె వెంకట్ స్వామి ఆరోపించారు.
వివిధ గ్రామాలకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించాలని వివరాలతో కూడిన పిటిషన్లను తహశీల్దార్ కృష్ణారెడ్డికి అందజేశారు. ప్రజల వ్యక్తిగత భూ సమస్యలన్నీ వారికి వివరించి దీర్ఘకాలం కానీయకుండా స్వల్ప కాలంలో భూ సమస్యలను పరిష్కారం చేయాలని పరిష్కారం కాకపోతే నిరంతరం ఉద్యమిస్తూనే ఉంటామని నూనె వెంకటస్వామి తెలిపారు.
ఈ ధర్నా కార్యక్రమంలో నాగిళ్ళ యాదయ్య, పబ్బు చంద్రశేఖర్గౌడ్, మేకల భిక్షం గౌడ్ ఉయ్యాల లింగస్వామి గౌడ్, ఉయ్యాల ప్రసాద్ గౌడ్, జిట్ట యాదయ్య, మారగోని శ్రీనివాస్ గౌడ్, దాసరి శంకరయ్య, మహంకాళి శ్రీనివాస్, గుజ్జ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.