తిరుమల తిరుపతి దేవస్థానంలో దీర్ఘకాలికంగా చాలీచాలని జీతాలతో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
టీటీడీలో ఖాళీగా ఉన్న సుమారు 8వేల ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చి తిరుపతి రాయలసీమ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు.
తిరుపతిలో”గరుడ వారధి” ఫ్లైఓవర్ పనులకు టీటీడీ నిధుల కేటాయింపులో మీనమేషాలు లెక్కిస్తోందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరింత నిధులు సకాలంలో విడుదల చేసేలా త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలని ఆయన కోరారు.
కరోనా వైరస్ బాధితులకు “ఆరోగ్య శ్రీ” పథకం ద్వారా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని సీఎం ప్రకటించినా ఎక్కడా అమలు కావడం లేదని పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు.
“స్విమ్స్” స్టేట్ కోవిడ్ హాస్పిటల్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని, టీటీడీ 19 కోట్ల నిధులను జిల్లా కలెక్టర్ కు ఇవ్వడంతో స్విమ్స్ లో పేషంట్లకు తగ్గట్టుగా పరికరాలను కొనుగోలు చేయలేక పోయారని ఆయన తెలిపారు.
“స్విమ్స్” అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి కేవలం 68 లక్షలు మాత్రమే విడుదల చేస్తుంది దానిని 5 కోట్లకు పెంచాలని ఆయన కోరారు.
“స్విమ్స్’ క్యాజువాలిటీలో వున్న 30 పడకల కారణంగా బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దానిని100 పడకలకు పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.