సామాన్యులకు న్యాయం చేయడమే లక్ష్యంగా నిబద్దతతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ ఖమ్మం విష్ణు యస్. వారియర్ అన్నారు.
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లో కొనసాగుతున్న 2019-20 బ్యాచ్ కు చెందిన ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్లు ప్రాక్టికల్ ట్రైనింగ్ లో భాగంగా ఈరోజు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. ప్రజలకు నిజాయితీతో సేవలందించి పోలీసు గౌరవం పెంపొందించాలని కోరారు.
ప్రధానంగా ప్రజలు ఎంతో నమ్మకంతోపోలీసుస్టేషన్ లకు వస్తారని, వారి నమ్మకానికి తగ్గట్టుగా భరోసా ఇస్తూ..మర్యాదపూర్వకంగా సున్నితంగా వ్యవహారించాలన్నారు.
శారీరక ధృడత్వంతో పాటు నిరంతరం మానసికంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల పట్ల ఎట్టి పరిస్థితులలో అలసత్వం చూపించవద్దన్నారు.
సాంకేతిక వినియోగం, నేరాల అదుపు, బందోబస్తు చర్యలు, కేసుల దర్యాప్తు, కోర్టులో చార్జిషీటు దాఖలు చేసి నిందితులకు శిక్షలు పడేలా దర్యాప్తు చేయాలంటూ విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లపై అవగాహన కల్పించారు. ప్రజలకు మరింత దగ్గరవ్వాలని, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కొత్త ఎస్ఐలకు మార్గనిర్దేశం చేశారు.
కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.