కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న తరుణంలో కోవిడ్ 19 మార్గదర్శకాలను మరింత కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు కృషి చేస్తున్నామని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు.
ఎక్కువ జన సమూహాలు చేరుతున్న ప్రాంతాల నుండి వైరస్ వ్యాప్తి విస్తృతం అవుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు సూచించారు.
అదే సమయంలో వివాహాల సీజన్ ప్రారంభం కావడంతో పాటు వర్షాకాలం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా వివాహాలు చేసుకోవడానికి వీలుగా 50 మందికి మించకుండా ఉండే విధంగా షరతులతో కూడిన అనుమతులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
అయితే కేవలం వివాహాలకు మాత్రమే ఫంక్షన్ హాల్స్ లో అనుమతించడం జరుగుతుందని, కళ్యాణాలు మినహా మరే ఇతర ఫంక్షన్స్ నిర్వహించుకోవదానికి అనుమతులు లేవని ఎస్పీ వివరించారు. జిల్లాలోని ప్రజలు, ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు సంబంధిత పోలీస్ స్టేషన్ల నుండి ఈ అనుమతులు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కేవలం 50 మందికి మాత్రమే అనుమతిస్తున్న క్రమంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఫంక్షన్ హాల్స్ యజమానులు, నిర్వాహకులు సైతం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ రంగనాధ్ సూచించారు.
కరోనాపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉన్నదన్నారు. జిల్లాలోని ఫంక్షన్ హాల్స్ యజమానులు చేసిన విజ్ఞప్తి మేరకు, ప్రభుత్వ తాజా మార్గదర్శకల ప్రకారం 50 మందిని అనుమతిస్తూ వివాహాలకు షరతులతో కూడిన అనుమతులు జారీ చేయనున్నట్లు ఎస్పీ రంగనాధ్ వివరించారు.