అమరావతి రైతులను అరెస్టు చేసి సంకెళ్లు వేసినందుకు నిరసనగా చలో గుంటూరు అంటూ నేడు రాజధాని ఐకాస ఇచ్చిన పిలుపు ఉద్రిక్తంగా మారింది.
గుంటూరు సబ్ జైలుకు బయలు దేరిన రాజధాని రైతులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. రైతులను రిమాండ్ లో ఉంచిన జైలువద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వివిధ మార్గాలలో జైలువద్దకు వచ్చిన దాదాపు 150 మంది అమరావతి రైతులను అరెస్టు చేశారు. రాజధాని రైతులను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు.
మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకుపోయారు. చాలా చోట్ల ఎక్కువ సంఖ్యలో రైతులు గాయపడ్డారు. ఉండవల్లి గ్రామం ఉద్రిక్తంగా మారింది.
విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. దళిత మహిళ JAC నాయకురాలు శిరీష ను ఆమె ఇంటి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది.