వరద సహాయం పక్కదారి పట్టిందని ఆరోపిస్తూ అసలైన లబ్ధిదారులకు అందడం లేదని వరద బాధితులు రాస్తారోకో నిర్వహించారు.
హైదరాబాద్ లోని వరద ప్రభావిత ప్రాంతం అయిన అంబర్ పేట్ నియోజకవర్గం నల్లకుంట డివిజన్లోని తిలక్ నగర్ బస్తీవాసులు ఆందోళనకు దిగారు.
అసలైన లబ్ధిదారులకు కు వరద సహాయం కింద ప్రభుత్వం ఇచ్చే పది వేల రూపాయలు అందడం లేదని తిలక్ నగర్ రోడ్డుపై రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరి తీవ్రంగా నష్టపోయిన అసలైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే సహాయం అందకుండా ధనికులకు, ఇంటి ఓనర్లకు, వాళ్ల పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారని ఆరోపించారు.
నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని దారి మళ్లిస్తున్నారని అన్నారు. నిజమైన లబ్ధిదారులను పట్టించుకోని జిహెచ్ఎంసి అధికారులు, నాయకుల పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.