ప్రభుత్వాలు ఎన్నిమారినా పేదల పక్షాన నిలబడి పోరాడేది కమ్యూనిస్టు పార్టీయేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పేర్కొన్నారు. బీజేపీతో వైసీపీకి ఉన్నట్లుగా లోపాయికారీ ఒప్పందాలు కమ్యూనిస్టులకు ఉండవని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో నిర్మితమైన లక్షలాది టిడ్కో ఇళ్లు తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలకై సేకరించిన వేల ఎకరాల్లో జరిగిన అవినీతిపై వెంటనే సిట్టింగ్ జడ్జీచేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీ మేరకు టిడ్కో ఇళ్ల రుణ బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. వాయిదాలు లేకుండా ఇళ్ల స్థలాలు తక్షణమే పేదలకు ఇవ్వాలని, ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే కమ్యూనిస్టులపై అపవాదులు వేయటం సీఎం జగన్ మానుకోవాలని రామకృష్ణ సలహా ఇచ్చారు.
previous post
next post