కరోనా వైరస్ ప్రభావం తగ్గినట్టే తగ్గి మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో ప్రపంచాన్నివణికిస్తోంది. మన దేశంలోనూ కరోనా రెండో దశ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కరోనా వైరస్ తన రూపాన్నిమార్చుకుంటోందని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో తేలిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నావైరస్ లక్షణాలు లేని అనేక మంది వ్యక్తుల్లో మంటగా అనిపించడంలాంటి సమస్యలు ఉన్నాయని బార్సిలోనా యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన సర్వేలో తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నిజాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
కరోనా- బయటపడ్డ మరికొన్నిలక్షణాలు!
కరోనా లక్షణాలు ఎలా ఉంటాయనే దానిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. జలుబు, దగ్గు, జర్వం తలనొప్పి, రుచి లేకపోవడం, వాసన తెలియకపోవడం వంటివి కరోనా లక్షణాలుగా గుర్తించారు. తాజాగా వీటితోపాటు కరోనాకు సంబంధించి మరికొన్నిలక్షణాలు కూడా ఉన్నట్టు బార్సిలోనా యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన సర్వేలో వెల్లడైంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం, సుదీర్ఘకాలం ఒక పనిపై దృష్టి పెట్టలేకపోవడం వంటివి కూడా కరోనా లక్షణాల్లో భాగమే అని బార్సిలోనా యూనివర్శిటీ పరిశోధకులు తేలింది. చాలా మంది కరోనావైరస్ బాధిుతుల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా కొన్ని వారాలు, నెలల పాటు నాడీ సమస్యలతో బాధపడుతున్నారని, కరోనా వైరస్ రోగం నిర్ధారణ అయిన నెలల తర్వాత ఊపిరితిత్తులు, గుండె దెబ్బతినడం వంటి సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు.
కాబట్టి వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బయటికి వెళ్లిన ప్రతిసారి ముఖానికి మాస్కు ధరించడంతోపాటు శానిటైజర్ వెంటబెట్టుకొని వెళ్లాలని, ఇతరులతో మాట్లాడేటప్పుడు భౌతిక దూరం పాటించాలని, రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు మంచి ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచించారు.
రోగనిరోధక శక్తిని పెంచుకునే సాధారణ పద్ధతులు
దాహం అనిపించినప్పుడల్లా గోరు వెచ్చని నీరు త్రాగడం. ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం. రోజువారీ వంటకాలలో పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ప్రతి రోజు కనీసం 20 నిమిషాల పాటు ఎండలో ఉండాలి. పొడి దగ్గు ఉంటే తాజా పుదీనా ఆకులు వేడి నీటిలో వేసుకొని ఆవిరి పీల్చాలి. కోవిడ్ నుంచి కోలుకున్నతర్వాతా గోరువెచ్చని నీటినే తాగాలి. తేలికపాటి వ్యాయామాలు, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం లాంటివి చేయాలి. సులువుగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి.
డాక్టర్ అర్జా శ్రీకాంత్, స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19