నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి కరోనా సోకడం ఆగడం లేదు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిలో 9 మంది అనుమానితుల రక్తనమూనాలను సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలకు హైదరాబాద్ ల్యాబ్ కు పంపించారు. అందులో మరో స్టాఫ్ నర్స్ కు సెక్యూరిటీ గార్డు కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ గురువారం ఉదయం తెలిపారు.
వీరికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించాలని జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభు లకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో తగిన జాగ్రత్తలు చేపట్టాలని, ఆసుపత్రికి వచ్చిన రోగుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విధులకు హాజరయ్యే డాక్టర్లు మరియు సిబ్బంది తప్పనిసరిగా వ్యక్తిగత భద్రత పాటించి ఆసుపత్రికి వచ్చే ప్రజలకు వైద్య సేవలు అందించాలని సూచించారు.