సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత చురుకైన పాత్ర పోషించాలని అప్పుడే మంచి సమాజాన్ని నిర్మించేందుకు అవకాశం ఉంటుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు.
డాడీ హెల్చింగ్ ఫౌండేషన్, ప్రభాష్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ సినీ అభిమానులంటే కేవలం సినిమా టిక్కెట్లు కోసం లేదా థియేటర్ లో గోల చేయడం కోసం పరిమితం కాకూడదని, సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేపట్టినప్పుడే పేరు ప్రఖ్యాతలు సంపాదించవచ్చునన్నారు.
జిల్లాలో రక్తం కొరత తీవ్రంగా ఉందని, రక్తదాన శిబిరాలు ఏర్పాటుకు ప్రభాష్ ఫ్యాన్స్ ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభాష్ ఫ్యాన్స్ ఇప్పటికే కైవల్య రథం, ఉచిత అంబులెన్స్ నిర్వహిస్తూ ఇప్పుడు పార్ధివదేహాలను భద్రపరిచేందుకు ఫీజర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపిడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ ఆవిర్భావం నుంచి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉందని తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు అన్ని వర్గాల సహకారం అవసరమన్నారు. గ్రామంలో చెరువుల అభివృద్ధికి సహకరిస్తామని వేణుగోపాల్ పేర్కొన్నారు. మీడియా జేఏసీ కన్వీనర్ ఎస్.జోగినాయుడు మాట్లాడుతూ డాడీ ఫౌండేషన్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుందని, కలెక్టర్ చేతుల మీదుగానే పలు కార్యక్రమాలు జరిగాయన్నారు.
వాకర్స్ క్లబ్ మాజీ గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్ మాట్లాడుతూ మంచి సంకల్పంతో చేసే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందన్నారు. సీనియర్ న్యాయవాది పొన్నాడ రుషి మాట్లాడుతూ సేవ చేయాలన్న దృక్పధం ఉన్నవారు మాత్రమే సమాజం కోసం పనిచేస్తారని, డబ్బున్న వారంతా చేయలేరన్నారు.
ఫీజర్ ఏర్పాటుకు ఫౌండేషన్ సేవా కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన వ్యాపారవేత్తలు బాబూలాల్ హిరావత్, పేర్ల నరేష్, పెస్సీ శ్రీను, డాడి హెల్పింగ్ ఫౌండేషన్ చైర్మన్ ప్రభాష సూర్యలను కలెక్టర్ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, ఆర్మీ కాలింగ్ ప్రతినిధి రమణ, బరాటం నాగ కుమార్, సీతారాం, గోపాల్, లక్కీ, అనీల్, అప్పారావు, చిన్న, మనోహర్, అవినాష్, అఖిల్, తేజ, పృథ్వీ, సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.