PRC కేవలం 7.5% ఫిట్మెంట్ ప్రకటించడం తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఊహించని నిరాశను మిగుల్చిందని TPCC జాయింట్ సెక్రెటరీ ఎండీ. అజీజ్ పాషా అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని, ప్రభుత్వ నివేదిక అశాస్త్రీయంగా ఉందని అజీజ్ పాషా విమర్శించారు.
ఉద్యోగస్తులు 63 శాతం ఫిట్మెంట్ అడిగితే కేవలం 7.5 శాతం ఇస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉండటం సరికాదని ప్రభుత్వానికి హితవు పలికారు. ఉద్యోగులు ఆశించిన కనీస వేతనం 25000 రూపాయలు కాకుండా కేవలం 19000 రూపాయలు సూచించడం అన్యాయం అన్నారు.
పెరిగిన పెట్రోలు, డీజిల్, నిత్యావసరాలు, ఇంటి అద్దెలకు అనుగుణంగా లేని ప్రతిపాదనలు చేయటం సరికాదని, ఇంటి అద్దెకు హెచ్ఆర్ఏ ను గణనీయంగా తగ్గిస్తూ పీఆర్సీ నివేదికల్లో పేర్కొన్నారని, ఇప్పుడున్న దాని ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటుతో హెచ్ఆర్ఏ పెంచాలని ఉద్యోగులు విన్నవిస్తే కమిషన్ మాత్రం తగ్గిస్తూ సూచనలు చేసిందని అన్నారు.
ఇప్పటి వరకు 30, 20, 14,5, 12 శాతం హెచ్ఆర్ఏ ఉండగా పీఆర్సీ తొలి నివేదికలో మాత్రం 24, 17, 13, 11 శాతంగా సూచించారని, రిటైర్మెంట్ బెనిఫిట్స్లో భాగంగా గ్రాట్యుటీ చెల్లింపుల్లో 20 లక్షలు ఆశిస్తే కేవలం 16 లక్షలు చెల్లించాలని ప్రతిపాదించారని, ఉచిత EHS అని చెప్పి ఇప్పుడు జీతంలో నుండి 1% కొత విధించడం తీవ్ర అన్యాయమని అన్నారు.
ఉద్యోగుల పిల్లల స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ గతంలో ఉన్న 2500 రూపాయలను తగ్గించి 2000 రూపాయలు ప్రతిపాదించడం ఇబ్బందని అన్నారు. సీపీఎస్ రద్దు కోసం పోరాడుతున్న లక్షలాది ఉద్యోగస్తులకు ఈ నివేదిక మరింత శాపంగా మారనుందని, తక్షణమే అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, సీపీఎస్ సంఘాలతో చర్చించి అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు అన్యాయం జరగనియ్యమని, వారి పక్షాన ఏ పోరాటానికైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అజీజ్ పాషా అన్నారు.