ఉద్యోగుల వేతన సవరణ ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం పొందిన పీఆర్సీ నివేదిక (జీవో ఎంఎస్ 51) ప్రతిని కూడా విడుదల చేసింది.
30 శాతం ఫిట్మెంట్ తో వేతన సవరణ అమల్లోకి రానుంది. ఉద్యోగులు, పింఛనర్లకు సంబంధించి పది (జీవో ఎంఎస్ నెంబర్ 51 – 60) ఉత్తర్వులను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ స్కేళ్లను సవరించింది.
2018 జులై 1 నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. ఇదంతా ఓకే మరి పెన్షనీర్ల గురించి ఏమిటి? ఇస్తాం ఉండండి…. తొందరెందుకు? అదేమిటండీ ఉద్యోగులకు ఇచ్చి పెన్షనర్లకు ఆపుతారా? ఎస్… పెన్షనర్లు అంత ముఖ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది.
పెన్షనర్ అంటే రిటైర్ అయిన వ్యక్తి… అంటే 60 ఏళ్లకు పైబడిన వారే ఉంటారు కదా? కరోనా కాలంలో క్షణం క్షణం భయం భయంగా బతుకుతున్న ఈ సీనియర్ సిటిజన్లను తెలంగాణ ప్రభుత్వం వెయిటింగ్ లో పెట్టింది.
2018 జూలై తర్వాత పదవీవిరమణ అయిన ఉద్యోగులకు కూడా 2020 పీఆర్సీ ప్రకారమే ఫించన్ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పెన్షనర్లు సంతోషించారు. ఈ నిర్ణయంలో కనీస ఫించను 6500 నుంచి 9500కు పెరుగుతుంది.
మరి ఈ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలి కదా? కానీ అలా చేయడం లేదు. పెన్షనర్లకు 36 వాయిదాల్లో బకాయిలు చెల్లిస్తామని చెబుతున్నారు. 3
6 వాయిదాలు అంటే మూడు సంవత్సరాలు. ఈ ప్రభుత్వానికి ఇంకా ఉన్న సమయం కేవలం 30 నెలలు. మరి 36 నెలలకు వాయిదాలు సర్దడం అంటే వచ్చే ప్రభుత్వం తరపున కూడా ఇదే ప్రభుత్వం హామీ ఇవ్వడం అన్నమాట.
ఇక్కడే చిక్కు వచ్చి పడుతున్నది. 30 నెలల కాలపరిమితి ఉన్న ప్రభుత్వం 36 నెలల హామీని ఎలా ఇస్తుందని పెన్షనీర్లు ప్రశ్నిస్తున్నారు.
మళ్లీ కేసీఆరే గెలిచి ముఖ్యమంత్రి కావచ్చు అది వేరే విషయం. అలా ఊహించి పిఆర్ సి ని అమలు చేయకూడదని పెన్షనీర్లు అంటున్నారు. కరోనా సమయంలో ఎంత కాలం బతికి ఉంటామో అర్ధం కాని తమను ప్రభుత్వం ఈ విధంగా చిన్న చూపు చూడటం తగదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ గురించి కనీసం మాట్లాడకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.