జర్నలిస్టు రఘు అక్రమ అరెస్టుకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ ధర్నా నిర్వహించింది.
కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద జర్నలిస్టులు నిరసన ప్రదర్శన చేశారు. తొలుత ఫ్లకార్డులతో నిరసన తెలిపి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోయిందని తెలంగాణ అమరవీరుల సాక్షిగా అమరవీరుల స్తూపానికి వినతి పత్రాలను ఇచ్చారు.
అనంతరం టీయూడబ్ల్యూజే ఐజేయూ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పాటైనది.
స్వతంత్ర తెలంగాణ రాష్ట్ర లక్ష్యం నీరుకార్చుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం జర్నలిస్టులపై చేస్తున్న దమనకాండను ఖండిస్తున్నామని అన్నారు.
అక్రమంగా ముసుగులు వేసుకుని అంతర్జాతీయ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు జర్నలిస్టును అరెస్టు చేయడం సరికాదన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పే పోలీసులు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇటువంటి తప్పుడు పద్ధతిలో అరెస్టులు చేసి జర్నలిస్టులను భయభ్రాంతులను చేస్తే అందరూ తమ మాట వింటారని అనుకోవడం అవివేకమన్నారు .
కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి కష్టపడి పని చేసిన పోలీసులు తెచ్చుకున్న మంచి పేరు కాస్తా ఇటువంటి అనాలోచిత చర్యల వల్ల పోతుందని అన్నారు.
ఇప్పటికన్నా జర్నలిస్టు రఘు అక్రమ అరెస్టు పట్ల పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్ర హోం శాఖ మరియు కేంద్ర హోంశాఖ సరైన దిశగా ఆలోచనలు చేసి పోలీస్ శాఖ పై పడుతున్న మచ్చను తుడుచుకోవలసిందిగా జర్నలిస్ట్ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ కేంద్ర కమిటీ సభ్యులు తూమాటి భద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుద్దుకూరు రామారావు, జిల్లా కార్యదర్శి జునమల రమేష్ , జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇమంది ఉదయ్ కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు రాజేష్, వెంకట భాస్కర్ జిల్లా నాయకులు రెడ్డిమల్ల నవీన్,ఎర్ర ఈశ్వర్ , శివ కృష్ణ అస్లాం, సాక్షి శివ,సామ్సన్ రాజు, ఉదయ్ రాజ్, జంపన్న, రాము, నరసింహరావు, ఆవుల కోటేశ్వరరావు, గుమలాపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.