క్షేత్రస్థాయి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సీఎం జగన్ జగన్ ప్రారంభించారని, ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, అధికారులను విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు.
సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా, అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకాలను అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు. సచివాలయ, వలంటీర్ వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయని, అక్కడక్కడా ఉన్నలోపాలను తొలగించి, మరింత సమర్ధవంతంగా పనిచేయడానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. వలంటీర్లకు సన్మాన కార్యక్రమం ఈనెల 19 నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
గ్రామస్థాయిలో పారిశుధ్య కార్యక్రమంపై దృష్టిపెట్టాలని, డిఎల్డిఓ వ్యవస్థ మరింత సమర్ధవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు. పంచాయితీరాజ్, విద్య, వైద్య శాఖలపై జెడ్పి సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
నాడూ-నేడు ఫేజ్ 3 ప్రతిపాదనలు సిద్దం చేయాలి…!
నాడూ-నేడు మూడో దశ పనులకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని జెడ్పి ఛైర్మన్ శ్రీనివాసరావు ఆదేశించారు. నాడూనేడు మొదటి, రెండో దశ పనులపై సమీక్ష నిర్వహించారు. కొత్త పాఠశాలలతోపాటు మొదటి, రెండోదశకి ఎంపికైన పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, కాంపౌండ్ వాల్స్, టాయిలెట్ బ్లాక్స్ తదితర మిగిలిపోయిన పనులను కూడా మూడోదశలో తీసుకోవాలని సూచించారు. పాఠశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు,
మరమ్మతు పనులను కూడా తీసుకోవాలన్నారు. మూడో దశ తరువాత అన్ని రకాల పాఠశాలలు, వసతి గృహాలు అన్ని వసతులతో, ఆధునిక సదుపాయాలతో శతశాతం సిద్దం కావాలని, ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఎంపిడిఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి నాడూనేడు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
జూన్ నెలాఖరుకి ప్రాధాన్యతా భవనాలు పూర్తికావాలి…!
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్మిస్తున్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల నిర్మాణం జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని జెడ్పి చైర్మన్ ఆదేశించారు. సిమ్మెంటు, ఇసుక, ఇతర నిర్మాణ సామగ్రి సిద్దంగా ఉందని, ఇటీవలే పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయడం జరిగిందని చెప్పారు.
బిల్లులు చెల్లించినప్పటికీ పనులను ప్రారంభించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనాల నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఏజెన్సీలను తొలగించి, కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేయాలని సూచించారు. వారం రోజుల్లో అన్ని భవనాల నిర్మాణ పనులు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. చివరి దశలో ఉన్న పనులను ప్రారంభించేందుకు సిద్దం చేయాలన్నారు.
నిర్ణీత కాలవ్యవధిలో గడప గడపకు పనులు..!
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని ఛైర్మన్ అన్నారు. జిల్లాలో ఇప్పటికే 70 శాతం గ్రామాల్లో ఈ కార్యక్రమం పూర్తి అయ్యిందని చెప్పారు. ఈ కార్యక్రమం క్రింద చేపట్టిన పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. నిధులు కూడా సిద్దంగా ఉన్నాయని, ఇప్పటికే సుమారు 70లక్షలు వరకు బిల్లులను చెల్లించడం జరిగిందని తెలిపారు.
ఏ రోజుకారోజు పనులకు ప్రతిపాదనలు సిద్దం చేసి, వెంటవెంటనే ప్రారంభించాలని సూచించారు. జరిగిన పనులకు బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని చెప్పారు. ఇప్పటివరకు ఆమోదం పొందిన అన్ని పనులను వారం రోజుల్లోగా ప్రారంభించాలని ఆదేశించారు.
ఫ్యామిలీ ఫిజీషియన్పై విస్తృత ప్రచారం….!
గ్రామీణ ప్రజల చెంతకే వైద్యసేవలను అందిస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం, దేశంలోనే ఒక వినూత్నమైన, ఆదర్శనీయ కార్యక్రమమని జిల్లా పరిషత్ ఛైర్మన్ పేర్కొన్నారు. ఈ విశిష్ట కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఆయా గ్రామాలకు డాక్టర్లు వెళ్లే కార్యక్రమం షెడ్యూల్ను ముందుగానే ప్రకటించాలని ఆదేశించారు. దీనివల్ల గ్రామస్తులకు ముందుగా సమాచారం అందుతుందని చెప్పారు.
అలాగే గ్రామస్తులకు ఈ కార్యక్రమంపై మరింతగా అవగాహన కల్పించి, సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకొనేలా చూడాలని కోరారు. సిఇఓ, డిప్యుటీ సిఈఓ, డిఎల్డిఓలు, ఎంపిడిఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమాన్ని పరిశీలించాలని సూచించారు.ఈ సమావేశంలో జెడ్పి సిఈఓ డాక్టర్ ఎం.
అశోక్కుమార్, డిప్యుటీ సిఈఓ కె.రాజ్కుమార్, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల డిఈఓలు, డ్వామా పిడిలు, పంచాయితీరాజ్ ఎస్ఈలు, డిసిహెచ్ఎస్లు, డిఎల్డిఓలు, ఎంపిడిఓలు, ఎంఈఓలు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.