కరోనా సోకిందా? ఏం ఫర్వాలేదు మేం ఉన్నాం. రండి చికిత్స చేసేస్తాం అంటూ ఆహ్వానిస్తున్నాయి అనుమతి పొందిన ప్రయివేటు ఆసుపత్రులు. అయితే ఈ చికిత్సకు సంబంధించిన ప్యాకేజీలు చూస్తే అంతకన్నా చావడమే మేలనిపిస్తున్నది. కరోనా చికిత్స కోసం ప్రయివేటు ఆసుపత్రుల్లో మూడు రకాల ప్యాకేజీలు పెట్టారు.
ఎంతో తెలుసా? ఒకటి 16 లక్షల ప్యాకేజీ. ప్రయివేటు ఆసుపత్రిలో చేరిన కరోనా పాజిటీవ్ రోగికి వెంటిలేటర్ పెడితే, పెట్టాల్సిన అవసరం వస్తే చాలు 16 లక్షలు చెల్లిచాల్సిందే. అదే ఆక్సిజన్ తో ఆగితే అదృష్టం. 11 లక్షల ప్యాకేజీతో ఆగుతుంది. అలా కాకుండా కేవలం సాధారణ చికిత్స అందచేస్తే 8 లక్షల ప్యాకేజీ వసూలు చేస్తున్నారు.
అంటే కరోనా చికిత్స కోసం ప్రయివేటు ఆసుపత్రికి వెళితే కనీసంగా 8 లక్షలు ముందుగా చెల్లించాలి. ఆ తర్వాత అదృష్టాన్ని బట్టి 11 లక్షల వరకూ వెళతారా, 16 లక్షలకు వెళతారా అనేది తేలుతుంది. 16 లక్షల ప్యాకేజీ చెల్లించడం అంటే వెంటిలేటర్ వరకూ వెళ్లడం అన్నమాట.
ఆ తర్వాత రోగి బతుకుతాడా లేదా అనేది గ్యారెంటీ లేదు. కరోనా కు మందే లేదు అని చెబుతున్న ఈ సమయంలో ఇంత ప్యాకేజీలకు ప్రభుత్వం ఎలా అనుమతించిదో అర్ధం కావడం లేదు. కరోనా రోగులకు చికిత్స కు అనుమతి పొందిన ఆసుపత్రులే కాకుండా సాధారణ ఆసుపత్రులలో కూడా కరోనా ముందస్తు జాగ్రత్తల కోసం 600 నుంచి వెయ్యి రూపాయల వరకూ అదనంగా కరోనా ఫీజు వసూలు చేస్తున్నారు.
రోగులకే కాకుండా రోగి అటెండెంట్లకు కూడా కరోనా మాస్కులు ఇతర వస్తువులను ఇచ్చినందుకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఏతావాతా చూస్తూ ప్రయివేటు ఆసుపత్రుల కరోనా దోపిడి మొదలైనట్లుగానే భావించాలి.