విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం చేయడం సరైంది కాదని, ఎన్నో త్యాగాలతో, ఉద్యమాలతో స్థాపించబడిన ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని జనసాహితి జిల్లా కార్యదర్శి పి మోహన్ రావు తెలిపారు.
జనసాహితి శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేడు చర్చా కార్యక్రమం జరిగింది. ఏపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాగరాజు అధ్యక్షత వహించారు. 1992 నుండి నూతన ఆర్థిక విధానాల కారణంగా ఏర్పడిన ప్రైవేటీకరణ భారతదేశ పరిశ్రమలను సర్వ నాశనం చేసుకుంటూ వచ్చిందని, ఒక ప్రక్క నిరుద్యోగం మరొక ప్రక్క ఉద్యోగాల తొలగింపు జరుపుకుంటూ వచ్చిందని వారన్నారు.
ఈరోజు ఉత్తరభారతంలో వ్యవసాయ రంగానికి కాపాడుకోవడానికి రైతు ఉద్యమం, దక్షిణ భారతంలో విశాఖ ఉక్కు ఉద్యమం జరుగుతోందని, మేధావి వర్గం నిరసన ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉందని చర్చా వేదిక అధ్యక్షులు ప్రజాసాహితి నాగరాజు తెలిపారు.
ప్రభుత్వాలు వ్యాపారం చేయవని, వ్యాపారం చేసిన వారికి పరిశ్రమలన్నీ కట్ట పెడతామని చెప్పడం సామాజిక బాధ్యత లేకపోవడమేనని రంగారావు భాగవతార్ వివరించారు. జనసాహితి బాధ్యులు చావలి శ్రీనివాస్ మాట్లాడుతూ – కరోనా కు ముందు ఆ తర్వాత దేశంలో పరిస్థితి ఎంత దిగజారిందో ఉదహరిస్తూ, ప్రభుత్వ రంగ సామాజిక బాధ్యతను స్పష్టంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్. శంకర్రావు, కంచరాన భుజంగరావు, దాసరి రామ్మోహన్, పైడి శ్రీరామమూర్తి, రైతు కూలీ సంఘం బాద్యులు మొదలగువారు పాల్గొని విజయవంతం చేశారు.