భారత్ బంద్ లో భాగంగా శుక్రవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కడప కోటిరెడ్డి కూడలిలో కూరగాయలు రోడ్డుపై పోసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ అఖిల భారత కిసాన్ పోరాట సమన్వయ కమిటీ నేతృత్వంలో చేపట్టిన భారత్ బంద్ ప్రజలు స్వచ్ఛందంగా జయప్రదం చేశారన్నారు.
దేశంలో వ్యవసాయంలో పెట్టుబడి భారం పెరుగుతున్నప్పటికీ ఆదాయం అంతంత మాత్రానే వస్తోందన్నారు. అతివృష్టి అనావృష్టి తో నష్టపోయిన రైతులు అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చేతికొచ్చిన పంట గిట్టుబాటు ధర లభించే వరకు నిలువ చేసుకునే సౌకర్యాలు మార్కెట్ వ్యవస్థ పటిష్టం చేయాల్సిన పాలక ప్రభుత్వాలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి అన్నారు. పర్యవసానంగా కూరగాయల ధరలు ఒక్కసారిగా కుప్పకూలడం, ఉన్నఫలంగా ఆకాశాన్నంటడం ఇటు రైతులు అటు వినియోగదారులు నష్టపోగా మధ్యలో దళారులు బాగు పడుతున్నారన్నారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం అని చెప్పిన మోడీ సర్కార్ రైతులను ఆదుకునే చర్యలకు స్వస్తి చెప్పి వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల కట్టబెట్టి రైతులను కూలీలుగా మార్చే సాగు చట్టాలు తీసుకొచ్చారని వారు విమర్శించారు. దళారుల పాత్రలో బ్లాక్ మార్కెట్ కంపెనీలకు లైసెన్సులు ఇచ్చి దోపిడీకి ద్వారాలు తెరిచారు అన్నారు.
నాలుగు మాసాలుగా ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికీ బిజెపి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. రైతాంగ ఉద్యమం భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలను కదిలించి వేస్తుందన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే మోడీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకలించి వేసే పరిస్థితి వస్తుందని. తక్షణం రైతాంగ వ్యతిరేక చట్టాలు రద్దు చేసి, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరించుకొని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీల కట్టబెట్టే విధానానికి స్వస్తి పలకాలన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జి ఈశ్వరయ్య ట్రాక్టర్ నడిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ, విజయలక్ష్మి, కె సి బాదుల్లా, మునయ్య, మల్లికార్జున, భాగ్యలక్ష్మి, రైతు సంఘం నాయకులు శివ శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మేకల జయన్న, రామాంజనేయులు రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, శేఖర్ ,మూర్తి, కొండయ్య ఇతరులు పాల్గొన్నారు.