మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని స్పష్టంచేశారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ ప్రకటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలుచోట్ల రైతు సంఘాలు వేడుకలు జరుపుకుంటున్నారు. మిఠాయిలు పంచి తమ సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు.
మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామంటూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై భారతీయ కిసాన్ యూనియన్(BKU) నేత రాకేష్ తికాయత్ స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన.. పార్లమెంటులో వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు రైతుల ఆందోళన కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇప్పటికిప్పుడు ప్రధాని మోడీ ప్రకటనతో ఆందోళనలు విరమించేది లేదని తేల్చిచెప్పారు.