గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం, పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు ఎవరు బయటకు రావద్దని ఆర్డీవో మొగిలి వెంకటేశ్వర్లు కోరారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఇంట్లో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా సరే రోడ్డు పైకి వస్తే క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు పోలీసు అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు. అలాగే ఉదయం 6 నుంచి 9 గంటల వరకు షాపులు తీస్తున్నప్పుడు అక్కడికి వచ్చే వారు కనీసం మాస్కులు కూడా ధరించకుండా వస్తున్నారని అలా వస్తే ప్రమాదం కొని తెచ్చుకోవటమే అని పేర్కొన్నారు.
ఈ రోజు నరసరావుపేట లో 9 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వాటిల్లో 2 కేసులు అల్లూరివారిపాలెం గ్రామానికి చెందినవి కాగా మిగతా 7 కేసులు పట్టణంలో వరవకట్ట ప్రాంతంలో నమోదు అయ్యాయని చెప్పారు.