వైద్య ఆరోగ్య వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి, నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు అని పాడుకునే రోజులు వచ్చాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రేడియోలజి ల్యాబ్, డయాలసిస్ సెంటర్, కీమోథెరపి కేంద్రాలను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్తో కలిసి మంత్రి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం సమకూర్చిన న్యూట్రిషన్ కిట్స్ పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒకప్పుడు ఇదే హాస్పిటల్ లో కనీసం సరిపడు వైద్యులు ఉండేవారు కాదని, స్వల్ప సంఖ్యలో నర్సులు, సిబ్బంది ఉండే వారని కానీ, నేడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఏ విభాగంకు ఆ విభాగంలో ప్రత్యేక వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారని ఆయన తెలిపారు.
ఒకప్పుడు 250 పడకలలోనే 500 మంది రోగులు, ఒక్కో బెడ్ కు ఇద్దరు పేషంట్స్ ఉండేవారని ఇవన్నీ తాను స్వయంగా చూడటం జరిగిందని అన్నారు. కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 570 బెడ్స్ కు పెంచుకున్నమని, దీనికి తోడు ప్రత్యేక మాతా శిశు కేంద్రం, ట్రామా కేర్, క్రిటికల్ కేర్ యూనిట్, డయాలసిస్ ఇలా అనేక సేవలు ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు.
ఆరోగ్య మహిళ పథకం మహిళలకు, కంటి వెలుగు పథకం ద్వారా కొన్ని లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు చేపట్టి లక్షల మందికి కంటి అద్దాలను పంపిణీ చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.166 కోట్ల నిధులను ఇప్పటికే కేటాయించగా, 100 ఎంబీబీఎస్ సీట్లతో ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభం కానున్నాయని, రూ.9 కోట్లతో కళాశాలకు కేటాయించిన పాత కలెక్టరేట్ భవనం ఆధునీకరణ, రూ.3.5 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు చేసుకున్నామని మంత్రి వివరించారు.
ప్రతి పీహెచ్సీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ప్రధాన ఆసుపత్రికి వచ్చే వారికి 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తామని, ఈసీజీ, 2డీ ఈకో, ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, మెమెగ్రఫీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. గతంలో వివిధ పరీక్షల కోసం ప్రభుత్వ వైద్యులు ప్రయివేటు ల్యాబ్లకు పంపేవారని కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అలాంటి పరిస్థితి లేదన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేస్తున్న టీ డయాగ్నోస్టిక్ హబ్, రేడియోలజీ ల్యాబ్లను ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు అండగా ఉందని, ప్రజలు ప్రయివేటు ఆసుపత్రికి, ప్రయివేటు స్కానింగ్ సెంటర్లకు వెళ్లొద్దన్నారు.
ఏ వైద్య పరీక్ష కావాలన్నా ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు చేస్తారని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం మన జిల్లా ఆసుపత్రిలోనే అన్ని ఏర్పాట్లు చేసిన దృష్ట్యా ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలని ప్రజలను మంత్రి కోరారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు. గర్భిణుల్లో పోష్టికాహార లోపం, రక్తహీనత నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందజేయడం శుభ పరిణామం అన్నారు. ఇప్పటికే తొలి విడతలో పలు జిల్లాల్లో గర్భిణులకు అందజేయగా రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణులకు కిట్ల పంపిణీలో ఖమ్మం జిల్లాలో కూడా పంపిణీ చేస్తున్నామన్నారు.
కొవిడ్ వంటి విపత్కర సమయంలో ప్రైవేట్ దవాఖానలు మూతబడగా, రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నదన్నారు. ప్రజలకు ప్రైవేట్లో అందుబాటులో లేని అనేక సదుపాయాలను ప్రభుత్వ దవాఖానాల్లో కల్పిస్తూ వస్తోందని, ఇప్పటికే అన్ని జిల్లా ప్రధాన దవాఖానాల్లో టీ హబ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో నిరుపేదలు పరీక్షలు చేయించుకుంటున్నారన్నారు.
డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు అత్యంత ఖరీదైన వైద్యం పూర్తి ఉచింతంగా అందుతోందని, పాలియేటివ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్య సేవలు పొందుతున్నారన్నారు.
దీనికి తోడు రేడియాలజీ హబ్ ఏర్పాటు చేయడంతో ఖరీదైన సిటీస్కాన్ , ఎక్స్రే సేవలు అందుబాటులోకి వచ్చాయని, మాతా శిశు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుతో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య రోజురోజుకూ గణణీయంగా పెరుగుతోందన్నారు.
శస్త్ర చికిత్సల విభాగాలన్నింటినీ బలోపేతం చేయడం, పూర్తి స్థాయిలో వైద్యులను నియమించడంతో అన్ని రకాల శస్త్ర చికిత్సలు ఇప్పుడు ప్రభుత్వ దవాఖానాల్లోనే జరుతున్నాయని, ఒక పక్క పీహెచ్సీ, యూహెచ్సీలు ఉండగానే ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసిందన్నారు. మహిళలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని పంచాలనే లక్ష్యంతో మార్చి నెలలో ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా కేంద్రాల్లోని అన్ని దవాఖానాల్లో ప్రత్యేకంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఆత్యవసర వైద్య సేవల్లో ప్రాణవాయువును అందిస్తున్నమన్నారు.
ఒకప్పుడు సర్కారు వైద్యమంటే భయాందోళనలో ఉన్న రోగులు ఇప్పుడు ప్రభుత్వ దవాఖానలకు వచ్చేందుకు ఏమాత్రం సంకోచించకుండా పూర్తి విశ్వాసంతో వైద్యం కోసం వస్తున్నారని పేర్కొన్నారు. చివరి దశలో ఉన్న వృద్ధుల కోసం పాలియేటివ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశామని, పోషకాహార లోపంతో జన్మించిన నవజాత శిశువుల కోసం ప్రత్యేకంగా డైస్ను అందుబాటులోకి తెచ్చిందని, కరోనా వంటి విపత్కర సమయంలో 250 ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక విభాగంతో వైద్య సేవలు అందించామని గుర్తు చేశారు.
అలాంటి సందర్భంలోనే ప్రత్యేకంగా సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసి, ప్రైవేట్ లారీ ట్యాంకర్ ద్వారా ప్రతి రోజూ 5టన్నుల ఆక్సీజన్ ను తెప్పించి దవాఖానాలోని ప్రతి బెడ్కు ఆక్సిజన్ పాయింట్ ఇచ్చి సేవలు అందించిడం జరిగిందని, ప్రతి విభాగంలో శస్త్ర చికిత్సలు నిర్వహించి రోగులను కంటికి రెప్పలా చూసుకుంటున్నామని పేర్కొన్నారు.
కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించిన వైద్య సిబ్బందికి శిరసువంచి కృతజ్ఞతలు తెలియజేశారు. కేటిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్-ఏ-స్మైల్ పేరున అత్యవసర అవసరం నిమిత్తం తన సొంత ఖర్చులతో అంబులెన్స్ను కేటాయించినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఇంకా అనేక సేవలు ప్రజలకు అందిస్తామని స్పష్టం చేశారు. జూన్`14 ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రక్త దానం చేశారు.