చంద్రయాన్-3 ప్రయోగం వైపు యావత్ ప్రపంచం ఆసక్తి చూస్తోంది. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగే ఆ క్షణాల కోసం భారతావని ఎదురుచూస్తోంది. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావాలంటూ ప్రతీ భారతీయుడి హృదయం ప్రార్థిస్తుంది. అంతరిక్ష వినువీధుల్లో భారత త్రివర్ణపతాకాన్ని రెపరెపలాడించే ఇంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో..అన్నమయ్య జిల్లా రాజంపేట కు చెందిన ఆంధ్రా కుర్రోడు కూడా భాగస్వామి అయ్యాడు…
చంద్రయాన్ – 3 విజయవంతం కావడంతో భారతీయులంతా అనందభరితమైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ప్రతి భారతీయుడు శాస్త్రవేత్తల మేధస్సును కొనియాడుతున్నారు. మన శాస్త్రవేత్తల మేధస్సు కారణంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. శాస్త్రవేత్తల వల్ల యావత్ భారత దేశం సగర్వంగా కాలర్ ఎగరెస్తుంది. చంద్రయాన్ – 3ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తల బృందంలో మన రాజంపేట చెందిన ఏర్రబాలు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ఉన్నారంటంటే నిజంగా ఇది రాజంపేట వాసులకే కాదు జిల్లా ప్రజలకు గర్వకారణం అని చెప్పాలి.
రాజంపేట మండలం దిగువబసినాయుడుగారిపల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వై.సుబ్రమణ్యం రెడ్డి, చంద్రకళ దంపతుల తనయుడు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి బెంగుళూరు ఇస్రో లో సైంటిస్ట్ గా పనిచేస్తూ చంద్రయాన్ – 3 మిషన్ (ప్రయోగం) లో పాల్గొన్నారు. చంద్రయాన్ – 3 విజయవంతం కావడం, ఆ ప్రయోగ బృందంలో రాజేంద్ర ప్రసాద్ రెడ్డి పాల్గొనడం పట్ల ఆయన స్నేహితులు, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి తల్లిదండ్రులను పలువురు అభినందిస్తున్నారు.
ఎంటెక్ పూర్తి అయ్యాక క్వాల్ కం కంపెనీ తమ కంపెనీ లో ఉద్యోగం ఇచ్చేందుకు రాజేంద్రప్రసాద్ రెడ్డికి 43 లక్షల ప్యాకేజీతో ఆఫర్ ఇచ్చింది. అయితే రాజేంద్ర ప్రసాద్ రెడ్డి తన మేధస్సును దేశానికి ఉపయోగించాలన్న ఆశయంతో ఆ ఉద్యోగాన్ని తిరస్కరించి సైంటిస్ట్ అయ్యారు. సైంటిస్ట్ అయ్యాక తాను భాగస్వామ్యం అయిన తొలి ప్రయోగం చంద్రయాన్ – 3 విజయవంతం కావడం పట్ల రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి భారతీయుడు లాగే తాను తన మాటల్లో వర్ణించ లేని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు.