రేషన్ డీలర్లను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన కృష్ణాజిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
రేషన్ డీలర్లను తొలగిస్తున్నారంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేషన్ డీలర్లను తొలగించే ఆలోచన లేదని అసెంబ్లీలోనే తాను స్వయంగా చెప్పానన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి అందించాలన్న ఆలోచనతో సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు.
జనవరి 1 నుంచి ఇంటివద్దకే రేషన్
జనవరి ఒకటవ తేదీ నుండి కార్డుదారులకు ఇంటి దగ్గరే రేషన్ ను అందజేస్తామన్నారు. ఇందుకోసం 9,200 వాహనాలను కొనుగోలు చేశామన్నారు. ప్రతి ఏటా రూ. 360 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని, అయినప్పటికీ వెనక్కి తగ్గేది లేదన్నారు. కరోనా కాలంలో పేదలను ఆదుకునేందుకు 16 విడతలుగా ఉచితంగా రేషను అందజేశామన్నారు.
డీలర్ల సమస్యలు పరిష్కరిస్తాం
రేషన్ డీలర్ల సమస్యలను పౌరసరఫరాల శాఖ కమిషనర్ తో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. తన పరిధిలో లేని సమస్యలను సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆంధ్ర ప్రదేశ్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బి వెంకటేశ్వరరావు, ఏపీ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మండాది వెంకటరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకరి సూర్యారావు, ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు కోశాధికారి మధుసూదనరావు తదితరులు మాట్లాడారు. అనంతరం మంత్రి కొడాలి నానిని ఘనంగా సన్మానించారు.