ములుగు జిల్లాలోని 31 క్లస్టర్లలో చేపడుతున్న రైతు వేదికల నిర్మాణాల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. గురువారం జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ కార్యాలయంలో ఇంజనీర్లతో నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు వేడుకలకు నిధుల కొరత లేదని, చేపట్టిన పనుల మేరకు వెంటనే చెల్లింపులు చేయాలని తెలిపారు.
వెంకటాపురం సబ్ డివిజన్లో 6 నిర్మాణాలకు గాను 3 బేస్నెంట్ లెవెల్, 3 లేంటల్ లెవల్ లో, ఏటూరునాగారం సబ్ డివిజన్లో 10 నిర్మాణాలకు గాను 3 బేస్మెంట్, 6 లేంటల్, ఒకటి రూఫ్ లెవెల్ లో ఉన్నట్లు, ములుగు సబ్ డివిజన్లో 15 నిర్మాణాల్లో 3 ప్రారంభ దశలో, 1 బేస్మెంట్, 8 లేంటల్, 3 రూఫ్ లేవల్లో ఉన్నట్లు ఆయన అన్నారు.
అన్ని నిర్మాణాలకు ఉపాధిహామీ క్రింద అంచనాలు జనరేట్ చేశామన్నారు. ఒక్కో నిర్మాణానికి రూ. 22 లక్షల అంచనాలుండగా, వ్యవసాయ శాఖ ద్వారా రూ. 12 లక్షలు, ఉపాధిహామీ కన్వర్జెన్సీ క్రింద రూ. 10 లక్షలు వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.
వచ్చే పది రోజులు పగలు, రాత్రి పనులు చేపట్టి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని కలెక్టర్ అన్నారు. పనులు మందకొడిగా చేపడుతున్న చోట కాంట్రాక్టర్లను తప్పించి, త్వరగా పూర్తి అయ్యేలా మరొకరితో చేయించాలన్నారు.
పూర్తి అయిన పనులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని ఆయన అన్నారు. ప్రతి రోజు పనుల పురోగతిపై సమీక్షిస్తూ పనుల పర్యవేక్షణ చేయాలని, ఇంజనీర్లు వ్యక్తిగత శ్రద్ధతో పనుల పూర్తికి చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో చేపడుతున్న వైకుంఠ దామాల బిల్లులు వెంటనే అప్లోడ్ చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ సమీక్ష లో పంచాయతీ రాజ్ ఇఇ రాంబాబు, డిఇ లు బి. చంద్రు, రవీందర్, ఏఇలు తదితరులు పాల్గొన్నారు.