ఎన్నికల సందర్భంగా అర్హులైనవారికి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. గురువారం ఆయన ఖమ్మం పట్టణంలోని దంసలాపురం ప్రాంతంలో పునాదులేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, నగర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ దీపక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఖమ్మంలో ఏడాదికి 2 వేల ఇండ్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్, కేటీఆర్ లు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఖమ్మంలో 14 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉండాలని అన్నారు. కానీ..ఈ ఏడేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది 417 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మాత్రమేనని భట్టి అన్నారు.
చెప్పిన 12 వేల ఇండ్లకు.. ఇక్కడ పునాదులేసి వదిలేసిన 192 ఇండ్లకు లెక్క ఎలా సరిపోతుందని భట్టి అన్నారు. అల్లిపురంలో కూడా డబుల్ ఇండ్లు నిర్మిస్తున్నట్లు తెలిసింది.. అక్కడ కూడా చూశాక.. ఖమ్మంలో ఎన్ని ఇండ్లు కడుతున్నారు.. వాటిని ఎవరికి ఇవ్వబోతున్నారు? అన్న ప్రశ్నలు తేలాల్సి ఉందన్నారు.
ప్రభుత్వం తీసుకున్న కొన్ని డివిజన్ల దరఖాస్తులే దాదాపు 15 వేలకు పైగా ఉంటాయని అన్నారు.