ప్రసావానికి వచ్చిన మహిళకు వైద్యం నిరాకరించిన ప్రభుత్వ వైద్యులపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. హెచ్ఐవి సోకిన గర్భిణీ మహిళకు ప్రసవం చేసేందుకు వైద్యులు నిరాకరించిన ఘటన కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడకు చెందిన హెచ్ఐవి సోకిన ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా హెచ్ఐవి ఉన్నట్లు గుర్తించిన వైద్యసిబ్బంది కిట్లు లేవంటూ సూర్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. పురిటి నొప్పులతో గర్భిణీ ని సూర్యాపేటకు తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో పండంటి మగ బిడ్డ కు జన్మనిచ్చింది. కాగా సకాలంలో ఆసుపత్రికి చేరుకోకపోవడంతో శిశువు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. కాగా వైద్యుల నిర్లక్షం పై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.