విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.
‘‘ వనరుల సమతుల పంపిణీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇటీవల మంత్రి మండలిలో ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పరిపాలన రాజధానిగా విశాఖ, న్యాయ పాలన కర్నూలు నుంచి, చట్ట సభలను అమరావతిలో ఉంచాలని నిర్ణయించింది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
వైఎస్సార్ నవశకం ద్వారా వలంటీర్లతో నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకున్నది. జగనన్న అమ్మ ఒడితో 100శాతం అక్షరాస్యత సాధించేలా ప్రయత్నం చేస్తున్నాం. తెలుగును కొనసాగిస్తూ అన్ని తరగతుల విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదివేలా రూపకల్పన చేశాం. మనబడి నాడు-నేడుతో 45వేల పాఠశాలలు, 471 జూనియర్ కళాశాలలు, 151 డిగ్రీ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన జరిగింది.
జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్థులకు పుస్తకాలు, సమ దుస్తులు పంపిణీ చేస్తున్నాం జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందచేస్తున్నాం. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా అన్ని వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేయడం సంతోషకరం.
రూ.2,300 కోట్లతో జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ కంటి వెలుగు, వైఎస్సార్ పింఛను కానుక ద్వారా రాష్ట్ర ప్రజలకు లబ్ది చేకూరుతున్నది వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాలు అమలు చేస్తున్నాం’’ అని గవర్నర్ తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.