నేటి కాలంలో తల్లిదండ్రులు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని, సంపాదనతోపాటు తమ పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డా.కె. అనితారెడ్డి కోరారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండలో నేడు జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పిల్లలకు సమయాన్ని కేటాయిస్తూ తల్లిదండ్రులు ప్రేమగా మెలగాలని, అదే విధంగా పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని ఆమె కోరారు.
పిల్లలు ఎదుగుతున్న క్రమంలో ఎన్నో శారీరక, మానసిక పరివర్తన మార్పులతో వ్యవహరిస్తారన్నారు. పాఠశాలలో ఒత్తిడి, తోటి విద్యార్థులు నుండి బెదిరింపులు, స్నేహితుల అర్థంకాని పరిస్థితులు వంటివి ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ఈ విషయాలను తల్లిదండ్రులకు చెప్పుకోవడానికి పిల్లలు భయపడతారని అన్నారు. పిల్లలతో తల్లిదండ్రులు సమయం ఇచ్చి కలిసిమెలసి ఉంటేవారితో స్నేహంగా వ్యవహరిస్తేనే పిల్లలు తాము ఎదుర్కొనే సమస్యలను తల్లిదండ్రులకు వివరిస్తారని పేర్కొన్నారు.
పిల్లలలో మానసిక సమస్యలు తలెత్తినప్పుడు తిండి సరిగా తినకపోవడం, నిద్ర పోకపోవడం, కోపం, విసుగు, బాధను ఇతరులపై వెళ్ళగక్కడం ఇతరులపై చికాకు పడటం, కుటుంబ సభ్యులతో కాకుండా ఒంటరిగా ఉండటం, తమలో తాము ఏడుస్తూ కుమిలిపోవడం చేస్తారని ఆమె అన్నారు. దానిని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యత అని అనితారెడ్డి అన్నారు.
ఇవే కాక పిల్లలలో మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తలనొప్పి, నిద్రలేమితో బాధపడటం, కళ్ళక్రింద నల్లటి చారలు ఏర్పడతాని ఆమె అన్నారు. పిల్లల ప్రవర్తన వెనుక గల కారణాలను తల్లిదండ్రులు నిశితంగా గమనించాలని, స్నేహితుల ద్వారా సమాచారం సేకరించాలని, పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకొని అడిగి తెలుసుకోవాలని అన్నారు.
ఇలాంటి లక్షణాలు పిల్లలలో కనిపిస్తే వైద్యున్ని సంప్రదించి సకాలంలో చికిత్స జరిపించాలని, దానితోపాటు చక్కటి కౌన్సలింగ్ ని ఇప్పించాలని అనితారెడ్డి అన్నారు. పలు అంశాలలో అనురాగ్ సొసైటి ద్వారా మోరల్ కౌన్సిలింగ్ పిల్లలకు అందిస్తున్నామని ఆమె తెలిపారు.