విభిన్న భాషలూ, మతాలూ, సంప్రదాయాల సంగమమైన విశాల భారతాన్ని దృష్టిలో పెట్టుకుని మన రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రపంచ చరిత్ర లోనే ఇదొక అద్వితీయమైన విషయం.
రెండో ప్రపంచ యుద్ధం తరువాత వలస పాలన నుంచి విముక్తి పొంది, రిపబ్లిక్ గా అవతరించడం తో పాటు ప్రజాస్వామ్యం, సార్వత్రిక వయోజన ఓటు హక్కు, చట్టబద్ధ పాలన, రాజ్యాంగబద్ధ వ్యవస్థ, లౌకిక వాదం, పీడితులకు రక్షణ వంటి విశిష్టతలతో ముందడుగు వేసిన మొట్టమొదటి గొప్ప దేశం ఇండియానే.
మానవతకు, స్వేచ్ఛకు, వివేకానికి ప్రతీక అయిన గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఏటా జనవరి 26 న మనం ఎంతో ఆనందోత్సాహాలతో పండగ చేసుకోవాలనడంలో సందేహం లేదు.
న్యూఢిల్లీ లోని ఇర్విన్ స్టేడియం (ప్రస్తుత మేజర్ ధ్యాన్చాంద్ స్టేడియం) లో 1950 జనవరి 26 ఉదయం 10.30 గంటలకు భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ మువ్వన్నెల జాతీయ పతాకం ఆవిష్కరించడం తో భారత్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది.
అసలు గణతంత్ర దినోత్సవం అంటే..?
భారత దేశ చరిత్రలో జనవరి 26,1950 వ సంవత్సరం భారతీయులు అందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15,1947 న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి వరకూ మన దేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది.
వారిని మన దేశం నుంచి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించు కునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. అలా.. 1950, జనవరి 26 న రాజ్యాంగం నిర్మించబడి, డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా, భారత దేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. ఆ రోజు నుంచి భారత దేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపు దిద్దుకుంది.
గణతంత్ర రాజ్యం అంటే..
ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ ను ఏర్పాటు చేశారు. 1947 ఆగస్టు 29 న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఛైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటయ్యింది.
అనేక సవరణల అనంతరం 1949 నవంబరు 26 న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచం లోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.
ఇలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 వ తేదీ నుంచి అమలు జరిపారు. ఆనాటి నుంచి భారత దేశము “సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర” రాజ్యంగా అవతరించబడింది. అప్పటి నుంచి ఈ రోజును గణతంత్ర దినోత్సవం గా జరుపు కుంటున్నాము.