ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తక్షణమే పదవికి రాజీనామా చేయాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ ఉన్మాదులకు పంచాయితీ ఎన్నికలపై భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు షాక్ ట్రీట్ మెంట్ అని ఆయన అన్నారు.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించి ప్రజాస్వామ్యాన్ని రక్షించిందన్నారు. రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించమని ధర్మాసనం తేల్చి చెప్పిడాన్ని బట్టి జగన్ ప్రభుత్వం ఉన్మాదంతో వ్యవహరిస్తున్నట్టు భావిచాలన్నారు.
వ్యాక్సినేషన్ ఎన్నికలకు అడ్డంకి కాదని, ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ధర్మాసనం చెప్పడాన్ని అందరూ ఉద్యోగుల నేతల తీరు అర్థం చేసుకోవాలన్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకోమని కోర్టు తెలపడం గమనించాలన్నారు.
ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదని, రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో ఉద్యోగులకు ఏమి సంబంధం అంటూ ప్రశ్నించడాన్ని ఉద్యోగ సంఘాల నేతలు అతిగా ప్రవర్తించారన్న విషయం వెల్లడైందన్నారు. ఈ తీర్పులో ప్రస్తావించిన వ్యాఖ్యలు అర్థం చేసుకుని సిఎం జగన్ మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదవి నుంచి వైదొలగాలన్నారు. ఎన్నికల కమీషన్ ఆదేశాలను పాటించని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అతిగా ప్రవర్తించిన ఉద్యోగుల సంఘాల నాయకులపై కేసులు పెట్టాని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.