ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల మోతకు విద్యార్ధుల తల్లిదండ్రులు భయాందోళనలకు గురి అవుతున్నారని టి పి సి సి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అజీజ్ పాషా అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కి బహిరంగ లేఖ ద్వారా ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం మహ్మద్ అజీజ్ పాషా మాట్లాడుతూ రాష్ట్రంలో పేద,మధ్య తరగతి కుటుంబాల వారికి నాణ్యమైన విద్య అనేది ప్రాథమిక హక్కని,ప్రస్తుతం విద్య సామాన్యుడికి అందని ద్రాక్షగా అంగట్లో సరుకుగా మారిందని,దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలే అని,విద్యను ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకొని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన,ఉచిత విద్యను అందించాల్సిన ప్రభుత్వాలు విద్యను ప్రైవేట్పరం చేసి ప్రభుత్వం తన భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.
ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో రేషనలైజేషన్ పేరిట ప్రభుత్వ స్కూళ్ళను మూతపడేలా చేయడం విద్యను నిర్వీర్యం చేయడంలో భాగమేనని,దీనికితోడు ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రైవేట్ విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చిందని, సర్కార్ పాఠశాలల్లోని విద్యా బోధనపై అసంతృప్తిగా ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివించడానికి మొగ్గు చూపుతున్నారని, ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతూ,ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుందని అన్నారు.
ప్రస్తుతం 26 వేల ప్రభుత్వ పాఠశాలలు,1000 గురుకులాలు,200 మోడల్ స్కూళ్ళు,500 కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో కలిపి 30 లక్షల మంది,12 వేల ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు 35 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు.
ఇదే అదునుగా తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని,సకాలంలో ఫీజులు చెల్లించని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకపోవడం,పాఠశాలకు అనుమతించక పోవడం వంటి చర్యలతో విద్యార్థులను,తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని,దీంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటమో,లేదా చదువు మధ్యలోనే వదిలేసిన సంఘటనలు అనేకం ఉన్నాయని అన్నారు.
ఇటువంటి సంఘటనలు జరిగిన సమయంలో విద్యాశాఖ అధికారులు సమీక్షలు జరిపి తాత్కాలిక చర్యలు చేపట్టి చేతులు దులుపుకోవడం మినహా పటిష్ఠమైన చర్యలు తీసుకోవడం లేదని,దీని కారణంగా విద్యావ్యవస్థలో సమస్యలు పేరుకొని ఉన్నాయని అజీజ్ పాషా అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యావ్యవస్థ ప్రక్షాళన కోసం ప్రయత్నించాలని, ఒకవైపు ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతం చేయడానికి కార్యాచరణ చేపడుతూనే
ప్రైవేటు విద్యాసంస్థల నియంత్రణ కోసం పటిష్ఠమైన చట్టాన్ని రూపొందించాలని కోరారు. ఫీజుల నియంత్రణ కోసం 2017లో జస్టిస్ తిరుపతిరావు కమిటీ వేసి అనేక సంప్రదింపులు జరిపిందని,చివరకు 2018లో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది కానీ పలు కారణాల వల్ల దానిని ఇప్పటి వరకూ అమలు చేయకపోవటం దురదృష్టకరమని అన్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మరోసారి ఫీజుల నియంత్రణ అంశం చర్చకు వచ్చిందని,ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది మంది మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.
అయితే కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా త్వరితగతిన ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని,ఫీజుల నియంత్రణతో పాటు,ప్రైవేట్ పాఠశాలల నిర్వహణ, వాటిలో పనిచేస్తున్న సిబ్బంది జీతభత్యాలు,ఆరోగ్య భద్రత,నాణ్యమైన విద్యపైన ఒక నియంత్రణ కమిటీ వేసి ఒక పటిష్ఠమైన చట్టం చేయాలని,అప్పడే ప్రజలందరికీ నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు.
సిఎం కెసిఆర్ విద్యా సంవత్సరం ప్రారంభమైనందున కాలయాపన చేయకుండా వెంటనే ఫీజుల నియంత్రణకు చట్టం అమలు చేయాలని అజీజ్ పాషా తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్