కుషాయిగూడలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న దేవస్థానం స్థలంలో పెట్రోల్ బంక్ నిర్మించాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతూ తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్ కు డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి సమర్పించిన వినతి పత్రంలో కోరారు. ఆదివారం కార్పొరేటర్ తో పాటు ఈ మేరకు కుషాయిగూడ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరో వినతి పత్రాన్ని సమర్పించారు.
దేవాలయం ఎదురుగా ఉన్న ఈ స్థలంలో దసరా ఉత్సవాలతో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు పార్కింగ్ సౌకర్యం ఉంటుందన్నారు. ఈ స్థలాన్ని వ్యాపార పరంగా నిధులు సమకూర్చుకునేందుకు ఉపయోగించుకోవాలనుకుంటే కింది భాగంలో పార్కింగ్ సౌకర్యం కల్పించి పై భాగంలో కళ్యాణ మండపాన్ని నిర్మించాలని ఆమె సూచించారు. తద్వారా ఆలయానికి ఆదాయం చేకూరుతుందని, కళ్యాణ మండపం అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.
గుడికి సమీపంలోనే ప్రస్తుతం ఒక పెట్రోల్ బంకు ఉందని, ఈలాంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైన పెట్రోల్ బంకు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని పెట్రోల్ బంక్ నిర్మాణం ప్రతిపాదనను ఉపసంహరించు కోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా కుషాయిగూడ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మరో వినతిపత్రాన్ని సమర్పించారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా