సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పడినా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని టి పి సి సి జాయింట్ సెక్రెటరీ ఎండి అజీజ్ పాషా అన్నారు. ఆదివారం ఈ మేరకు ఆయన పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు.
సుమారు 5 నెలల క్రితమే ఆర్డిఓ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగిందని, డివిజన్ కేంద్రంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలైన DSP, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్,RTO కార్యాలయాలను ప్రభుత్వం మంజూరు చేయాలని ఆయన కోరారు. హుజూర్ నగర్ ప్రాంత ప్రజల పరిపాలనా సౌలభ్యం కోసం డివిజన్ పరిధిలో రావాల్సిన ప్రభుత్వం కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు సులభతరంగా ఉంటుందని అన్నారు.
ఈ ప్రాంత ప్రజలు ఇంకా వివిధ పనుల నిమిత్తం సూర్యాపేట, కోదాడ వెళ్లి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని దీనితో ప్రజలకు రవాణా భారంతో పాటు ఆర్థిక భారం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
హుజూర్ నగర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, చుట్టుప్రక్కల ఉన్న వివిధ ఫ్యాక్టరీల నుంచి వచ్చే భారీ వాహనాలు రాకపోకలు, ఆంధ్రా, తెలంగాణ వారధిగా మట్టపల్లి బ్రిడ్జి నుండి రాకపోకలు ప్రారంభం కావటంతో మునుపటి కంటే ట్రాఫిక్ భారీగా పెరిగిందని అన్నారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అధిక సంఖ్యలో వాహనాల పెరుగుదల ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గం లోని 7 మండలాల ప్రజల సౌకర్యార్థం వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డివిజన్ పరిధిలో రావాల్సిన ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని తక్షణమే మంజూరు చేయగలరని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, ముషం సత్యనారాయణ, ఇట్టిమల్ల బెంజిమెన్,దొంతగాని జగన్,కె. ముత్తయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.