ప్రపంచంలో ప్రముఖ వ్యక్తుల ఖాతాలను హ్యాకింగ్ చేసిన సంఘటనకు సంబంధించిన వివరాలను తమకు అందివ్వాలని భారత సైబర్ సెక్యూరిటీ నోడల్ ఏజెన్సీ సిఇఆర్టి-ఇన్ (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్) ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది. భారత్ లో అలా హ్యాకింగ్ కు గురైన ప్రముఖ వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో కూడా తెలపాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
వైరస్ వ్యాప్తి చేసిన ట్విట్లను ఎవరెవరు విజిట్ చేశారు? అందులోని డేటాకు ఎలాంటి నష్టమైనా వాటిల్లిందా అనే అంశాలపై స్పష్టతనివ్వాలని కోరారు. ఎలా హ్యాక్ చేశారు? ఇక ముందు ఇలా జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది కూడా తమకు వివరించాలని సిఇఆర్టి-ఇన్ అధికారులు ట్విటర్ట్ ను కోరారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు, అమెజాన్ సిఇవో జెఫ్ బిజోస్, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, టెస్లా సిఇవో ఎలాస్ ముస్క్ లాంటి ప్రముఖుల ట్విట్టర్ ఎకౌంట్లను సైబర్ ఎటాకర్స్ హాక్ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటనపై భారత్ ఎలర్ట్ అయింది. అంతే కాకుండా ఈ ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేసి బిట్ కాయిన్ ఎకౌంట్ లో వెయ్యి డాలర్లు వేస్తే రెండు వేల డాలర్లు వస్తాయని ట్విట్లు పెట్టారు. దాంతో లక్ష డాలర్ల విలువ అయిన క్రిప్టోకరెన్సీ బదిలీ అయింది. ఈ ఘటనకు సంబంధించి అన్ని వివరాలను పంచుకుంటామని ట్విట్టర్ సిఇవో జాక్ డోర్సే చెప్పారు. మొన్న సంఘటన జరిగిన నాటి నుంచి దీనిపై విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు.