29.7 C
Hyderabad
May 1, 2024 05: 01 AM
Slider ముఖ్యంశాలు

అధిక ఫీజులు వసూలు చేస్తే ఇక కఠిన చర్యలు తప్పవు

#privateschools

రాష్ట్రంలో తొలిసారిగా ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలకు సంవత్సర ఫీజులను ఖరారు చేశామని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షక కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు అన్నారు. విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల ఫీజుల నియంత్రణకు తీసుకున్న చర్యలపై గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఛైర్మన్ కాంతారావు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వ్యాపారం కారాదని, కనీస సౌకర్యాలు లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. పాఠశాల, కళాశాలలకు మూడేళ్ల వరకూ అమల్లో ఉండేలా ఫీజులను ప్రకటించామని ప్రభుత్వ సిఫాలకు అనుగుణంగా ఫీజుల నియంత్రణపై జి.ఓ.యంయస్.నెం. 53, తేది 24.08.2021ను, జి.ఓ.యంయస్.నెం.54, తేది:24.08.2021తో రెండు జిఓలను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన అన్నారు.

స్కూళ్లు, కాలేజీల ఫీజుల వసూళ్లలో ఇతర రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా తేడా కనిపిస్తున్నదని ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులు నోటి ఫై చేయకుండా ఇష్టానుసారంగా విద్యార్ధుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని కాంతారావు అన్నారు. ఇతర రాష్ట్రాలలో ప్రైవేట్ సంస్థల ఫీజులు ఆయా రాష్ట్రాలు నోటిఫై చేస్తే రాష్ట్రంలో గత 20ఏళ్ల నుండి ఫీజులు నోటిఫై చేయాలనే విషయాన్ని ఎవరూ ప‌ట్టించుకోలేదన్నారు.

ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలపై ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. దీనిలో భాగంగా కోవిడ్ కారణంగా ట్యూషన్ ఫీజు పై 30 శాతం తగ్గించాలని గత ఏడాదే ఆదేశాలిచ్చామని, ఏపిలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తే కమిషన్ నియంత్రించడంతో పాటు తగు చర్యలు కొరకు ప్రభుత్వానికి సిఫార్స్ చేస్తుందని ఆయన అన్నారు.

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల విషయమై తల్లిదండ్రులకు హక్కు ఉందని కమిషన్ ప్రకటించిన ఫీజులుకంటే అధిక ఫీజులు వసూలు చేసే విద్యాసంస్థలపై కమిషన్ కు ఫిర్యాదు చేయాలని కాంతారావు విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. గత ఏడాది కమిషన్ తరపున ప్రైవేట్ విద్యాసంస్థలను సందర్శించి తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాతే మూడుసంవత్సరాల కాలానికి పాఠశాలలు, కళాశాలలకు ఫీజులను ప్రకటించామని, ప్రభుత్వం ప్రకటించిన ఫీజులుకంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వం ప్రకటించిన ఈ ఫీజుల వలన 80 శాతం ప్రైవేట్ విద్యాసంస్థలకు ఎ టువంటి ఇబ్బందులు లేవని అన్నారు. గత ఏడాది కమిషన్ 360 పాఠశాలలను తనిఖీ చేసిందని కనీస సౌకర్యాలు లేకుండా అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ సంస్ధల పై చర్యలకు కమిషన్ సిఫార్స్ చేస్తుందని ఆయన అన్నారు. గత ఏడాది ప్రభుత్వం నిబంధనలు పాటించని 120 కళాశాలలపై చర్యలకు ప్రభుత్వానికి కమిషన్ సిఫార్స్ చేసిందని ఆయన అన్నారు. కేవలం ఫీజుల నిర్ధారణే కాకుండా ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యాప్రమాణాలు పాటించే విధంగా అవసరమైన చర్యలు తీసుకునే అధికారం కమిషన్ కు ఉందని ఆయన అన్నారు.

ఫీజులు ఎంత వసూలు చేస్తున్నార? ప్లేగ్రౌండ్ ఉందా? ఉపాధ్యాయులకు నెలజీతం ఎంత చెల్లిస్తున్నారు? మొదలగు పూర్తి వివరాలను ప్రైవేట్ విద్యాసంస్థలు కమిషన్‌కు అందించాల్సి ఉందన్నారు. ఏ విద్యాసంస్థ అయినా కమిషన్ నిర్ధారించిన ఫీజులు కంటే ఎక్కువ వసూలు చేస్తే ఆయా తల్లిదండ్రులకు అదనంగా కట్టిన ఫీజులను ఇప్పించే ఆలోచన కమిషన్ చేస్తుందని ఆయన అన్నారు.

ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులపై విద్యార్ధులు, పేరెంట్స్, టీచర్స్ ఆయా విద్యాసంస్థల యాజమాన్యం గానీ ఫిర్యాదులు చేయవచ్చునని, ఇందుకు సంబంధించి టోల్ ఫ్రీ నెం. 9150381111 కు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల్లోగా ఫోన్ చేసి తెలియజేయవచ్చునని కాంతారావు అన్నారు.

ఫిర్యాదు అందిన వారంలోగా సమస్యను పరిష్కరించడానికి కమిషన్ చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ప్రతీ విద్యాసంస్థ వద్ద కమిషన్ నిర్ధారించిన ఫీజుల వివరాలు ఆయా నోటీస్ బోర్డులలో అందరికీ తెలిసేవిధంగా ఏర్పాటు చేయాలని ఛైర్మన్ కాంతారావు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యానియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ వైస్ ఛైర్మన్ డా. ఏ.విజయశారదా రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలలో అధిక ఫీజులు వసూళ్లను నియంత్రించేందుకు విద్యను వ్యాపారంగా చేపట్టి అధిక ఫీజులు వసూలు చేసే విద్యాసంస్థలను నియంత్రించేందుకు ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని దీనిలో భాగంగా ఈకమిషన్ ఏర్పాటు చేయబడిందని ఆమె అన్నారు.

రాష్ట్రంలో తొలిసారిగా ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలకు సంవత్సర ఫీజులను మూడు సంవత్సరాలపాటు అమల్లో ఉండే విధంగా ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని విజయశారదా రెడ్డి అన్నారు.

పాఠశాలలకు నిర్ధారించిన ఫీజులను పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో నర్సరీ నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు సంవత్సరానికి రూ. 10 వేలు, 6వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు సంవత్సరానికి రూ.12 వేలు చొప్పున ఫీజులను నిర్ధారించామని, పట్టణాల పరిధిలో రూ.11 వేలు, రూ.15 వేలుగా నిర్ధారించామని, నగర ప్రాంతాలలో రూ.12 వేలు, రూ.18 వేలు ఫీజులుగా నిర్ధారించామన్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో యంపిసి, బైపిసి కోర్స్‌లకు రూ.15 వేలు, సిఇసి, హెచ్‌ఇసి, ఇతర కోర్స్‌లకు రూ.12 వేలు, పట్టణ పరిధిలో రూ.17500, రూ.15 వేలు, కార్పోరేషన్ పరిధిలో రూ.20 వేలు, రూ.18 వేలు ఫీజులను ప్రభుత్వం నిర్ధారించిందని ఆమె అన్నారు.

స్కూళ్లు, కాలేజీల్లో హాస్టలు ఫీజుల విషయానికొస్తే గ్రామీణ ప్రాంతంలో రూ. 18 వేలు, పట్టణ పరిధిలో రూ. 20 వేలు, నగర పరిధిలో 24 వేలు సంవత్సర కాల ఫీజులుగా ప్రభుత్వం నిర్ధారించిందని ఈ ఫీజులు 2021-22, 2022-23, 2023-24 విద్యాసంవత్సరాలకు వర్తిస్తాయని శారదా రెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యానియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ కార్యదర్శి ఆలూరి సాంబశివ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థల మేనేజ్ మెంట్ తామే ఫీజులు నిర్ధారించుకుని ఇంతవరకూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని దీనిపై ఇప్పుడు రెగ్యులేటరీ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఇకనుండి ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నిర్ధారణ ఈకమిషన్ నిర్ధారిస్తుందని ఆయన అన్నారు.

విద్యాసంస్థలు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తుంటే తల్లిదండ్రులు ప్రభుత్వం ఇచ్చిన జిఓ ప్రకారం యాజమాన్యాలను ప్రశ్నించాలని సూచించారు. విద్యాసంస్థలకు సంబంధించి అధిక ఫీజుల వసూలతో పాటు ఏదైనా పొరపాటు జరిగిందని ఫిర్యాదువస్తే కమిషన్ తగు చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.

ఫిర్యాదు అందిన వారంరోజుల్లోగా సరైజ్ విజిట్ చేసి ఆయా విద్యాసంస్థల తప్పు ఉంటే తగు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. గత 20 ఏళ్లుగా ప్రైవేట్ విద్యాసంస్థలకు ఫీజులను ఏ ప్రభుత్వం ఖరారు చేయలేదని దీనితో విద్యార్ధుల నుండి వారు వసూలు చేస్తున్న ఫీజులపై నియంత్రణ లేకుండా పోయిందని ఆలూరి సాంబశివరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షక కమిషన్ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల ఫీజుల నియంత్రణతో పాటు నాణ్యమైన విద్యాప్రమాణాలు సాధించేలా నిరంతరం పర్యవేక్షిస్తుందని, ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలపై చర్యలు తీసుకుంటామని సాంబశివరెడ్డి అన్నారు.

Related posts

సెన్సార్ పూర్తి చేసుకున్న “వి లవ్ బ్యాడ్ బాయ్స్”

Satyam NEWS

నిరాశ్రయులకు నిత్యావసరాలు అందించిన నవజీవన్ ఆర్గనైజేషన్

Satyam NEWS

మహిళా మెడలో గొలుసు కొట్టేయబోయి బుక్కైన చైన్ స్నాచర్…!

Bhavani

Leave a Comment