రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరిట ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరును మార్చి జగనన్న విదేశీ విద్యా దీవెన గా పేరు పెట్టటం అసహ్యంగా ఉందని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతులు బాలకోటయ్య అన్నారు. శుక్రవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరును తొలగించడం అంటే దళితుల ఆత్మ గౌరవంపై దాడి చేయటమేనని, దేశంలోని 140 కోట్ల మంది ప్రజలను కించపరచడంగానూ ఆయన అభివర్ణించారు. 1989 అట్రాసిటీ సెక్షన్ 3 క్రింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కూడా కేసు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. పథకాల పేర్ల పిచ్చిలో పడి, ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని పథకాలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి , వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్లు తగిలించుకున్నారని, ఐనా తృప్తి చెందక అంబేద్కర్ పేరును కూడా వదల్లేదు అని అన్నారు.
కిందికులాల ఒత్తిడి, ఆందోళనల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి విదేశీ విద్యా పథకాన్ని పునః ప్రవేశపెట్టారని తెలిపారు. అంబేద్కర్ పేరు ఉంచకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని, పార్లమెంట్ లో ప్రస్తానించే వరకు ఆందోళనలుచేస్తామన్నారు. అంబేద్కర్ పేరు ను యథాతథంగా ఉంచాలని, లేకపోతే తగన గుణపాఠం చెప్పి తీరుతామని బాలకోటయ్య హెచ్చరించారు.