దేశంలో లాక్ డౌన్ కారణంగా పేద బడుగు బలహీన వర్గాలు సంక్షోభంలోకి వెళ్లకుండా ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పథకాలు ప్రవేశపెడితే వాటిని వైసీపీ నేతలు తమ ఉపాధి హామీ పథకంలా మార్చుకుంటున్నారని రాష్ట్ర బీజేవైయం అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు ఆరోపించారు.
కడప జిల్లా రాజంపేటలో ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. పేద వారిని ఆదుకునేందుకు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా 1000 నగదు తో పాటు ఉచిత రేషన్ కేంద్రం పంపిణీ చేయగా, దురదృష్టవశాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి మంది మార్బలం వాటిని తమ పథకాలు గా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.
జగన్ రాజ గురువు పక్క రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోదీ ఇస్తున్న 1000 రూపాయల కు 500 జతచేసి ఇస్తున్నారని, ఏపీలో గ్రామ వాలంటీర్లను ఉత్సవ విగ్రహాలుగా చేసి 1000 నగదును వైసీపీ శ్రేణులు వారి జేబుల్లో వేసుకుంటున్నారని విమర్శించారు.
కరోనా మహమ్మారి పరిస్థితులు వైసీపీ శ్రేణులకు ఉపాధి హామీ పథకంలా మారిందని ఎద్దేవా చేశారు. వైద్యులకు ఇవ్వవలసిన మాస్క్ లు, శానిటైజర్లు వైసీపీ నేతలు, మంత్రులు వారికి కావల్సినన్నీ తీసుకుని పోవడం విచారకరమని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షల పేరుతో నీతులు చెప్పడం సరికాదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది కోసమే క్షేత్ర స్థాయిలో వైసీపీ నేతలు చేస్తున్న పనులకు ముఖ్యమంత్రి కి కూడా భాగస్వామ్యం ఉందని అనుమానం కలుగుతోందని అన్నారు.
ప్రభుత్వ ఖజానా లో తగినన్ని నిధులు ఉన్నా, ఆర్థిక కష్టాల పేరుతో పద్దుల రూపంలో ఉద్యోగుల జీతాలు చేస్తామని చెప్పడం సమంజసం కాదని అన్నారు. రెండు రోజుల్లో పి.యల్.ఆర్.గ్రూప్ కు, మెగా కృష్ణా రెడ్డి కి పార్టీ కాంట్రాక్టర్లకు వందల కోట్లు నగదు చెల్లించారని ఆరోపించారు. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, వారి దుశ్చర్యలను బీజేపీ ఎండగడుతుందని హెచ్చరించారు.