దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి సందర్భంగా జీహెచ్ఎంసీ కార్మికులు చేస్తున్న సేవలు అమోఘమని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఉప్పల్ జిహెచ్ఎంసి కార్యాలయం లో మంగళవారం జిహెచ్ఎంసి కార్మికులకు ఆయన మాస్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన 5 వేల ఎన్95 మాస్కులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కు మందు లేదని స్వీయ నిర్భందం ఒకటే మార్గమని భౌతిక దూరంతో ఉంటూ ప్రతి ఒక్కరూ తమ పనులు తాము చేసుకుంటూ జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన అన్నారు.
కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరంతరం కృషి చేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. కరోనా వైరస్ సందర్భంగా డాక్టర్లు, జీహెచ్ఎంసీ కార్మికులు, పోలీసులు,పత్రికా ప్రతినిధులు చేస్తున్న సేవలు అమోఘమని ఆయన కొనియాడారు.
ఏది ఏమైనా ప్రతి ఒక్కరు భవిష్యత్తులో ఇక దూరాన్ని పాటిస్తూ కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు కృషిచేయాలని ఆయన పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు బియ్యం నిత్యావసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మందుముళ్ళ పరమేశ్వర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మేకల శివారెడ్డి, బుడ్డే సాహేబ్ తదితరులు పాల్గొన్నారు.