టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బిసి టికెట్లు అమ్ముకున్నారని, అలాంటి రేవంత్ రెడ్డి బిసి డిక్లరేషన్ చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాజాల సురేందర్ విమర్శించారు. కామారెడ్డిలో విలేకరుల సమావేశంలో జాజాల సురేందర్ మాట్లాడుతూ.. 75 ఏళ్లలో 65 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించిందని, ఇన్నేళ్లలో ఎన్ని డిక్లరేషన్లు అమలు చేసారని ప్రశ్నించారు. గతంలో జిల్లాలో ఐదుగురు బిసి ఎమ్మెల్యే ఉండేవారని, ఇవాళ ఒక్కరు లేరన్నారు. కామారెడ్డిలో పోటీ చేస్తున్న కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుగా ఉందన్నారు.
కేసీఆర్ కామారెడ్డిలోనే కాదు ఎక్కడైనా పోటీ చేస్తాడని తెలిపారు. ఎల్లారెడ్డిలో కేసీఆర్ 30 గ్రామాలు తిరిగారని, నువ్వేనాడైనా తిరిగావా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. బిసి డిక్లరేషన్ సభలో ఒక్క బిసి ఫోటో అయినా పెట్టావా అని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లాలో టికెట్లు స్థానికేతరులకు అమ్ముకున్నారని ఆరోపించారు. గతంలో తన టికెట్ విషయంలో 5 కోట్ల రూపాయలు తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. బీసీలను ఆదుకుంది, ప్రోత్సహించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఏం ముఖం పెట్టుకుని డిక్లరేషన్ చేశావ్ రేటెంతరెడ్డి అని నిలదీశారు. బాన్సువాడలో కాసుల బాలరాజు టికెట్ ఎవరికో అమ్ముకుంటే ఆయన ఆత్మహతాయకు పాల్పడ్డది నిజం కాదా అని ప్రశ్నించారు. బిసిలకు 35 సీట్లు ఇచ్చింది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. నేడు చేసిన బిసి డిక్లరేషన్ కేసీఆర్ చెప్పిందే కాపీ కొట్టారని విమర్శించారు. ఇక్కడ బిసిల ఓట్లు అడిగే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. రేవంత్ రెడ్డి పుట్టు పూర్వోత్తరాలు ఆరెస్సెస్ నుంచి వచ్చినవేనన్నారు. ఇక్కడ షబ్బీర్ అలిని రేటు కుదరక నిజామాబాద్ పంపినట్టున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కామారెడ్డి ప్రజలు కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా ఇవ్వరని జ్యోస్యం చెప్పారు.
వారంటీ లేని పార్టీ గ్యారెంటీలు ఎవరు నమ్మరన్నారు. కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి తిరగవద్దని, తిరిగితే చెప్పుతో కొడతారన్నారు.
సత్యం న్యూస్, కామారెడ్డి