బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను కామారెడ్డి ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ ను ఆదరించాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. బిసి డిక్లరేషన్ సభలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఇటీవల హైదరాబాదులో జరిగిన బిసి ఆత్మగౌరవ సభలో పాల్గొన్న ప్రధాని మోడీ బీసీలను అవమానించారన్నారు. బిసిల వెనకబడిన వర్గాలకు తానే యుగపురుషుడిగా వచ్చినట్టు మోడీ చెప్పుకున్నారన్నారు. ప్రతి ఎన్నికల్లో అవినీతి డబ్బుతో కేసీఆర్ అమాయక ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తారన్నారు.
కేసీఆర్ అవినీతి సర్కార్ ను ఒడిస్తారని ప్రజలపై నమ్మకం ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ నేలకు ఒరిగిందని, ఇక్కడ నాలుగైదు సీట్లు గెలిస్తే ఎక్కువన్నారు. బీజేపీ నాయకులు మోడీ మీద విశ్వాసం ఉంచుకుని ఎన్నికలో పోటీ చేస్తున్నారని, కర్ణాటకలో 48 చోట్ల ప్రచారం చేసినా కాంగ్రెస్ అభ్యర్థులే భారీ మెజారిటీతో గెలిచారన్నారు. ఇక్కడ కూడా అదే జరుగుతుందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశం లేదని, 100 సార్లు మోడీ వచ్చినా డిపాజిట్ కూడా అక్కే అవకాశం లేదన్నారు. మోడీ 9 సంవత్సరాల్లో దేశానికి 125 లక్షల కోట్లు అప్పు చేసి దివాళా తీశారన్నారు.
తెలంగాణలో బిసిలకు 34 శాతం రిజర్వేషన్ ఉంటే 23 శాతానికి తగ్గించిన ఘనత కేసీఆర్ కకే దక్కుతుందన్నారు. ప్రధాని మోడీ, కేసీఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రకటించిన 5 గ్యారెంటీలు వెంటనే సాధ్యం కాదని, అమలు చేస్తే కర్ణాటక రాష్ట్రం దివాళా అవుతుందన్నారని గుర్తు చేశారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే 5 గ్యారెంటీలు కాంగ్రెస్ అమలు చేసిందన్నారు. నా పేరు వింటేనే మోడీ వణుకుతున్నారన్నారు. మోడీ, కేసీఆర్ అబద్ధాలను ప్రజలు నమ్మొద్దని, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అణగారిన వర్గాలకు న్యాయం చేసే ఏకైక పార్టీ అని తెలిపారు. బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అని, ఈ రెండు పార్టీలను బహిష్కరించి కాంగ్రెస్ ను ఆదరించాలని కోరారు
సత్యం న్యూస్, కామారెడ్డి