బాన్సువాడ కాంగ్రెస్ నాయకుడు కాసుల బాలరాజు టికెట్ దక్కకపోవడంతో ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం బిసి డిక్లరేషన్ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నాయకుల నుంచే నిరసన సెగ తగిలింది. తమ నాయకునికి కాకుండా నాన్ లోకల్ వ్యక్తికి టికెట్ కేటాయించడం పట్ల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి సభలో పాల్గొన్న బాన్సువాడ కార్యకర్తలు తమ నాయకుడు కాసుల బాలరాజుకు టికెట్ కేటాయించాలని నినాదాలు చేశారు. ‘ బిసి ముద్దుబిడ్డ కాసుల బాలరాజుకే కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలి.. వలస నాయకులు వద్దు.. లోకల్ నాయకులు ముద్దు, స్థానిక నాయకులు కాసుల బాలరాజు కావాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సుమారు అరగంట పాటు నినాదాలతో హోరెత్తించారు. అయినా తన ప్రసంగంలో బాన్సువాడ టికెట్ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించకుండానే ముగించడం గమనార్హం
సత్యం న్యూస్, కామారెడ్డి