అక్రమంగా సొమ్ము సంపాదించడం కోసం..ఏ మార్గం అయితే ఏంటీ చెప్పండి. పందిని చూపించి నంది అనే నమ్మించగలిగే వారు ఈ సమాజంలో కోకొల్లలు.
సులువుగా డబ్బు సంపాదించాలనే మార్గాలలో రైస్ పుల్లింగ్ ముఠా ఒకటి. ఇత్తడి,రాగి, ఇనుము,ఆల్యూమినం సామాన్లకు మహిమలు ఉంటాయని చెప్పి నమ్మించి సొమ్ము చేసుకునే దొంగతనం రైస్ పుల్లింగ్. నమ్మశక్యంగా లేదు కదూ….
ఇదిగో ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన ఈ డీఎస్పీ చేతిలో ఉన్న రాగి చెంబును ఒక్కసారి తదేకంగా చూడండి. (డీఎస్పీ పట్టుకున్న పోటో) ఇలాంటి ఇత్తడి చెంబుకు మహిమలు ఉంటాయని…కాలనీలలో ఇంటింటికి తిరిగి పాత చెంబులను పూజాగదిలో పెట్టుకుంటే మహిమలు వస్తాయని అనతి కాలంలోనే ధనవంతులు అవుతారని నమ్మించి అధిక ధరకు కొనుగోలు చేసే ముఠాను ఏపీలోని విజయనగరం సబ్ డివిజన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ మేరకు విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్ తన కార్యాలయంలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలియ చేసారు. జిల్లాలోని విజయనగరం, నెల్లిమర్ల,పూసపాటిరేగలకు చెందిన లక్ష్మణరావు, శ్రీనివాస, వెంకటరావు, అప్పారావులు ముఠా ఏర్పడి..ఈ రైస్ పుల్లింగ్ విధానం పేరుతో పాత ఇత్తడి సామాన్లను ఇంటిలో పెట్టుకునే అంతా మంచి,శుభం జరుగుతుందని జనాలను నమ్మించే వాళ్ల.
ఆ తర్వాత వారి నుంచీ డబ్బులు గుంచి పాత ఇత్తడి సామాన్లను అమ్మిస్తారు. రోజులు వెళుతున్నా.. పాత ఇత్తడి సామాన్లు అలానే ఉండటం ఇంటిలో ఏ విధమైన మార్పులు సంభవించకపోవడంతో తామంతా మోసపోయినట్టు గుర్తిస్తున్నారు.
ఇలానే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చందిన పొట్నూరు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా ఈ నకిలీ భాగోతం బయటపడింది. నెల్లి మర్ల పోలీస్ స్టేషన్ కు రెండు రోజుల క్రితం ఫిర్యాదు అందడంతో అప్రమత్తమైన డీఎస్పీ అనిల్ కుమార్…తన బృందంతో రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు.
వారి వద్ద నుంచీ 3 లక్షలు నగదు, 3 బైకులు, 4 సెల్ ఫోన్లు, మహిమ గల చెంబుగా నమ్మించి మోసగిస్తున్న ఓ రాగి చెంబు ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సమావేశంలో విజయనగరం రూరల్ సీఐ టి.ఎస్. మంగవేణి, ఎస్ఐ నారాయణరావు, నెల్లిమర్ల ఎస్ఐ దామోదరరావు, ఐడీ పార్టీ సభ్యులు పాల్గొన్నారు.