తరచూ జరుగుతున్న రోడ్ ప్రమాదాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రత్యేకంగా అచేతన స్థితిలో ఉన్న రహదారి భద్రతా కమిటీ ల బాధ్యతలు… తీరు తెన్నులనం పటిష్ట పరిచి తద్వారా నైనా రోడ్ ప్రమాదాలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నే సీఎస్..డీజీపీ ఆదేశాలతో…అన్ని జిల్లాల కలెక్టర్లు.. ఎస్పీలతో రహదారి భద్రతా సంఘం సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ సూర్య కుమారి ,ఎస్పీ దీపికా ల సమక్షంలో రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగింది.
ఈ మేరకు రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి వివిధ విభాగాల అధికారులను ఆదేశించారు. నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే సంబంధిత విభాగాల అధికారులు, సిబ్బంది స్పందించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందరింలో జరిగిన రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆమె పలు మార్గదర్శకాలు జారీ చేశారు.
రోడ్డు ప్రమాదాల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, కాలయాపన కారణంగా లేదా ఇతర కారణాల వల్ల ఒక్క వ్యక్తి కూడా చనిపోడానికి వీలులేదని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. తరచూ ప్రమాదాలు చోటు చేసుకొనే ప్రాంతాలకు సమీపంలో అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని సంబంధిత విభాగ అధికారులను ఆదేశించారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసు స్టేషన్కు, ఆసుపత్రికి వివరాలు తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్.ఐ.సి. కేంద్రంగా సేవలందించే ఐరాడ్ యాప్లో కూడా వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రమాదాల నివారణ, రోడ్ల మరమ్మతుల విషయంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. జాయింట్ తనిఖీలు చేపట్టి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ దీపికా ఎం. పాటిల్, డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ వి. సుందర్, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ, వైద్యారోగ్య శాఖ, పోలీసు శాఖ అధికారులు, ఐరాడ్ విభాగ జిల్లా మేనేజర్ శ్రీధర్, ట్రాన్స్పోర్టు అధికారులు, జాతీయ రహదారి విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు.