విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పలు రకాల చర్యలను చేపట్టాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిషోర్ కుమార్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద మరిన్ని జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు.
రహదారి భద్రతా కమిటీ సమావేశం కలెక్టరేట్లో జరిగింది. జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల వివరాలను, వాటి నివారణకు వివిధ శాఖల పరంగా తీసుకున్న చర్యలను ముందుగా రవాణాశాఖ డీప్యూటీ కమిషనర్ శ్రీదేవి వివరించారు. జాతీయ రహదారులతో పోలిస్తే, పంచాయితీ రోడ్లలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. వీటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కిషొర్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో రోడ్డ ప్రమాదాలు ఎక్కువగా జరిగే 62 బ్లాక్ స్పాట్స్ను గుర్తించడం జరిగిందని చెప్పారు. ఇలాంటి చోట తగిన జాగ్రత్తలు తీసుకొని, వాహనదారులను ముందే హెచ్చరించడం ద్వారా ప్రమాదాలను నివారించాలని సూచించారు.
దీనికోసం వివిధ ప్రభుత్వ శాఖలను భాగస్వాములను చేయాలన్నారు. ముఖ్యంగా విద్యాసంస్థలవద్ద మరింత కట్టుధిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించాలని సూచించారు.
దీనికోసం ఫేస్బుక్, యూట్యూబ్, టెలిగ్రామ్ తదితర డిజిటల్ మీడియాను వినియోగించుకోవాలన్నారు. రోడ్లపై పందులు, పశువుల సంచారం వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని నియంత్రించడంపై దృష్టి పెట్టాలని చెప్పారు.
రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే, విద్యార్థులకు చిన్నప్పటినుంచే రహదారి భద్రతా చర్యలు, నియమాలపట్ల అవగాహన పెంపొందించాలని జేసీ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో పోలీసుశాఖది కీలక పాత్ర అని అన్నారు. నగరంలో వేగంగా వాహనాలను నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖను కోరారు.
విద్యాసంస్థలు సుదీర్ఘ విరామం తరువాత పునఃప్రారంభం కానున్నాయని, అందువల్ల స్కూళ్లు, కళాశాల బస్సులను విస్తృతంగా తనిఖీ చేయాలని సూచించారు.
క్షతగాత్రులను ఆదుకొనేందుకు జిల్లాలో తక్షణమే ట్రామాకేర్ సెంటర్ను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని, దీనికోసం సరైన ప్రదేశాన్ని గుర్తించేందుకు ఆర్టిఏ, పోలీసు, ఆర్అండ్బి తదితర అధికారులతో ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేయాలని జెసి ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్డీఓ బిహెచ్ భవానీశంకర్, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, ట్రాఫిక్ డీఎస్పీ మోహనరావు, ఆర్అండ్బి ఎస్ఇ విజయశ్రీ, మార్కెటింగ్ ఏడి శ్యామ్ కుమార్, ఇంకా రవాణా, విద్య, వైద్యారోగ్యశాఖ, ఆర్టిసి, పంచాయితీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.