హైదరాబాద్ నగరంలోని హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 5లో రహదారి ఒక్కసారిగా కుంగిపోయింది. మట్టిలోడుతో వెళ్తున్న టిప్పర్ కుంగిన గుంతలో ఇరుక్కుపోయింది. రోడ్డు ఉన్నపళంగా కిందకు కుంగి, వాహనం ఇరుక్కుపోవడంతో డ్రైవర్, కూలీలు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్తో పాటు ఇద్దరు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డు పక్కనే నాలా ప్రవహిస్తోంది. బాధితులను ఇది మరింత ఆందోళనకు గురిచేసింది.స్థానికులను సైతం ఈ ఘటన భయాందోళనకు గురిచేసింది. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న స్థానిక కార్పొరేటర్ అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో టిప్పర్ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
previous post