అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన ఏపీ సీఎం జగన్ రెడ్డి మాట తప్పి మడం తిప్పారు. ఆ తర్వాత వారి పేస్కేలు ఇవ్వడంలో కూడా విఫలం అయ్యారు. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఒకటో తారీకు జీతాలు వస్తాయన్న ఆశ కూడా లేకుండా ఏపి ప్రభుత్వ ఉద్యోగులు బతుకుతున్నారు.
ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల ప్రయోజనాలను పణంగా పెట్టి వారు ఆర్ధికంగా లబ్ది పొందుతున్నారు. పదవులు కూడా పొందుతున్నారు. దాంతో ఉద్యోగులకు కడుపు మండిపోతున్నది. అధికారంలోకి వచ్చిన వారంలోపు సీపీఎస్ ను రద్దు చేస్తామని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తాను తీసుకొస్తానని బల్లగుద్ది చెప్పి గద్దెనెక్కిన సీఎం జగన్ తర్వాత ప్లేటు ఫిరాయించిన సంగతి తెలిసిందే. అది సాధ్యం కావడం లేదని దాని స్థానంలో మరో పథకం తెస్తామని జగన్ సర్కారు గతంలో చెప్పింది. అయితే, దాన్ని ఉద్యోగులు నమ్మడం లేదు.
దేశంలో ఇంకెక్కడా లేనట్లుగా గవర్నమెంట్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) తీసుకొచ్చామని చెప్పింది. ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లాంటిదేనని జగన్ సర్కారు చెబుతున్న మాటలను ఆర్టీసీ ఉద్యోగులు నమ్మడం లేదు. ఏపీ ప్రభుత్వం చెబుతున్న జీపీఎస్ మాకు అసలు వద్దే వద్దని ఆర్టీసీ ఉద్యోగులు దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. మూప్ఫై ఏళ్లుగా ఆర్టీసీలో కంటిన్యూ అవుతున్న ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పెన్షన్ లోనే కొనసాగుతామని వారు స్పష్టం చేస్తున్నారు.
ఏ పింఛను కావాలో ఆప్షన్ ఇవ్వాలంటూ ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులను ఇటీవల ప్రభుత్వం కోరగా.. దాదాపు 84 శాతం మంది ఈపీఎఫ్లో కొనసాగడానికే ఆసక్తి చూపారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్న తర్వాత ఆ ఉద్యోగులను ప్రజా రవాణాశాఖ ఉద్యోగులుగా 2020 జనవరి 1 నుంచి పరిగణించారు. అయితే అప్పటి నుంచి వీరి రిటైర్మెంట్ తర్వాత పింఛను ఇస్తారనే దానిపై మాత్రం జగన్ సర్కారు క్లారిటీ ఇవ్వలేదు. వీరి నుంచి ఆప్షన్ తీసుకోవాలని గత సంవత్సరం ఆర్థిక సంఘం సూచించింది. మరోవైపు 2004 సెప్టెంబరు తర్వాత గవర్నమెంట్ జాబ్ పొందిన వారికి కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్) అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీని స్థానంలో జీపీఎస్ అమలు చేసేలా ఇటీవల ప్రభుత్వం చట్టం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జీపీఎస్ అమలు కావాలంటే ముందు వాళ్లు సీపీఎస్లో చేరాలి. ఈ నేపథ్యంలో సీపీఎస్లో చేరతారా లేకపోతే ప్రస్తుతం అమల్లో ఉన్న ఈపీఎఫ్లో కొనసాగుతారా అనే ఆప్షన్ చెప్పాలని ఆర్టీసీ ఉద్యోగులందరికీ యాజమాన్యం ఆప్షన్లు ఇచ్చింది. దీంట్లో ఎక్కువ మంది 84 శాతం మంది ఈపీఎఫ్నే సెలెక్ట్ చేసుకున్నారు.
ఆర్టీసీలో ప్రస్తుతం 49,273 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా.. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు దక్కిన పోస్టింగ్లు పొందిన 286 మందికి సీపీఎస్ అమలవుతూ ఉంది. మిగిలిన 48,987 మందిలో ఇప్పటి వరకు 34,954 మంది ఆప్షన్ ఇచ్చారు. వీరిలో 29,337 మంది ఈపీఎఫ్లో కొనసాగుతామని సమ్మతి తెలిపారు. కేవలం 5,617 మంది మాత్రమే సీపీఎస్లో చేరతామని చెప్పారు. సీపీఎస్ను ఎంపిక చేసుకున్నాక, జీపీఎస్ అమలు చేస్తే.. నిర్దిష్టంగా ఎంత పింఛను వస్తుందో స్పష్టత లేదని ఎక్కువ మంది ఉద్యోగులు వాపోతున్నారు.
అయితే, ఈపీఎఫ్లో హయ్యర్ పింఛను విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని కోసం ఇప్పటికే ఎక్కువ మంది ఉద్యోగులు ఈపీఎఫ్ ట్రస్ట్కు ఓ ఆప్షన్ కూడా ఇచ్చారు. వీరిలో చాలా మందికి హయ్యర్ పింఛను అప్లై అవ్వడానికి ఎంత నిధి వారి అకౌంట్ లో ఉండాలో పేర్కొంటూ నోటీసులు వస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఆర్టీసీ ఉద్యోగులు ఈపీఎఫ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ నెల 12 నాటికి ఎంప్లాయిస్ అందరూ సీపీఎస్, ఈపీఎఫ్ల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకునే ఆప్షన్ గడువు ముగుస్తుంది. మిగిలిన ఉద్యోగుల్లో కూడా ఎక్కువ మంది ఈపీఎఫ్ ఆప్షన్ ఇచ్చే వీలుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.