ఎన్నికలు జరుగుతున్న పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న తరుణంలో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.
ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీకి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని ఆయన బహిరంగంగా ప్రకటించారు. మంగళవారం తన అబోహర్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో జాఖర్ చేసిన ఈ ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలో మళ్లీ సంచలనం రేగింది.
గత ఏడాది అప్పటి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పిసిసి అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ ఘర్షణ తారాస్థాయికి చేరుకున్నప్పుడు కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మొత్తం 79 మంది పార్టీ ఎమ్మెల్యేలలో 42 మంది తనను ముఖ్యమంత్రిగా చేపట్టాలని కోరుకున్నారని, ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే చున్ని వైపు మొగ్గు చూపారని సునీల్ జాఖర్ పేర్కొన్నారు.
ప్రస్తుత డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ రంధావాకు 16 మంది ఎమ్మెల్యేలు, కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్కు మద్దతుగా 12 మంది ఎమ్మెల్యేలు, సిద్ధూ ముఖ్యమంత్రి కావాలని ఆరుగురు ఎమ్మెల్యేలు కోరుకున్నారని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత పార్టీ అధిష్టానం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు ఇచ్చిన చున్నీని సీఎం చేసిందని ఆయన తెలిపారు. దాంతో తాను ఉపముఖ్యమంత్రి పదవి ప్రతిపాదనను తిరస్కరించినట్లు కూడా జాఖర్ తెలిపారు.