ధరణి పోర్టులో తప్పులు సవరించాలని,లక్ష రూపాయల ఋణమాఫీ తక్షణమే చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్,తెలంగాణ రాష్ట్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొప్పోజు సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్ సుధారాణి కి మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా పలువురు రైతు సంఘం నేతలు మాట్లాడుతూ ధరణి పోర్టల్ లో ఉన్న తప్పులను సవరించి రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన రైతుల లక్ష రూపాయల ఋణమాఫీ తక్షణమే అమలు చేయాలని,లక్ష రూపాయలకు నేటి వరకు రైతులు చెల్లించిన వడ్డీని తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.ధరణి పోర్టల్ లో అనేక తప్పులు ఉన్నాయని, రైతులు అనేక మంది కాళ్లకు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని, రైతుల గోడు పట్టించుకునే నాధుడే లేరని, తహశీల్దార్ ని అడిగితే ఆర్డిఓ అని,ఆర్డిఓ ను అడిగితే కలెక్టర్ అని,కలెక్టర్ ని అడిగితే ప్రభుత్వ ఆదేశాలు లేవని అనేక సాకులు చెబుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారని విమర్శించారు.
ఎన్నికల నాటినుండి లక్ష రూపాయలు రుణమాఫీ నేటికీ చేయకపోవడంతో రైతులు ప్రతి సంవత్సరం లక్ష రూపాయలకు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని,నేటికి దాదాపుగా లక్ష రూపాయల వరకు వడ్డీ చెల్లించారని, అసలు,వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.కొన్ని బ్యాంకులలో రైతుల పంట సాయం కొరకు ఇచ్చిన 5,000 రూపాయలను ఇవ్వకుండా రైతులను అనేక ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు, వడ్డీ చెల్లిస్తానని చెప్పినప్పటికీ రైతుల్ని ఇబ్బంది పెట్టటం సరైంది కాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు,దేవరం మల్లేశ్వరి,రైతు నాయకులు బంటు శ్రీనివాస్,గోవర్ధన్,జక్కుల రమణ, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్