సిఐటియు ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి మహర్షి సఫాయి కర్మచార్యుల కార్మికుల నూతన కమిటీ ఎన్నిక శుక్రవారం జరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు సిఐటియు ఆధ్వర్యాన శ్రీ వాల్మీకి మహర్షి సఫాయి కర్మచారుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు, హుజూర్ నగర్ పట్టణ కో కన్వీనర్ యల్క సోమయ్య గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా స్థానికంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో, వివిధ గృహాలలో సఫాయి కర్మచారి వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న కార్మికులకు ప్రభుత్వం నుండి ఎటువంటి సంక్షేమ పథకాలు అందటం లేదని అన్నారు.
ఇళ్ళు లేక రోడ్ల వెంట చిన్న గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని, వీరికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు,రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.
అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడిగా శీతల రోషపతి, అధ్యక్షుడిగా మహిపాల్, ఉపాధ్యక్షుడిగా పి.రాజు, బి.కిషోర్, ప్రధాన కార్యదర్శిగా పి.రాకేష్, జితేందర్, గౌరవ సలహాదారుగా సక్కు,
కార్యవర్గ సభ్యులుగా సురేష్, మీనా, రజిత, వెంకటేశ్వర్లు, ఎన్నికైనారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు ఉప్పుతల్ల గోవిందు, ప్రభాకర్ ,వీరబాబు, మోహన్, లక్ష్మి, సుజాత, సరిత తదితరులు పాల్గొన్నారు.