షార్జా ఇండియన్ స్కూల్ లో చదువుతున్నది సాండ్రా ఆన్ జాసన్. చదువుతో బాటు ఆటపాటల్లో చురుకుగా ఉంటుంది. ఆమె కేరళలోని పఠనంతిట్టలోని అడూర్ నివాసి అయిన జాసన్ థామస్ కుమార్తె. షార్జా లోని స్కూళ్లకు సెలవులు ఉన్న రోజుల్లో కేరళలోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది సాండ్రా.
సెలవులు పూర్తి కాగానే మళ్లీ షార్జా వెళ్లి పోయింది కానీ అక్కడకు వెళ్లిన తర్వాత సాండ్రాకు జ్వరం వచ్చింది. ఆ జ్వరం చికెన్ పాక్స్ (తడపర) గా మారింది. ఇదంతా జరిగింది 2014లో. ఆ నాటి నుంచి సాండ్రా కోలుకోలేదు. సాండ్రా కు ‘హెనోక్ స్కోలిన్’ పర్పురా ‘అనే అరుదైన వ్యాధి సంక్రమించింది.
ఇది దోమ కాటు వల్ల వచ్చే అతి తీవ్రమైన వ్యాధి. లక్ష మందిలో ఒకరికి వస్తుంది. అది సాండ్రాకు వచ్చింది. ఈ వ్యాధి కారణంగా సాండ్రా జీవితం ఆసుపత్రికే పరిమితం అయింది. కొద్ది రోజుల్లో మచ్చలు పెరిగి శరీరం వాచిపోయింది. తర్వాత కంటి చూపును కోల్పోయింది. చికిత్స తర్వాత సాండ్రా సాధారణ జీవితానికి తిరిగి వచ్చింది.
కానీ 2019లో మళ్లీ వ్యాధి తిరగబెట్టింది. లోలోన కిడ్నీలు దెబ్బతిన్నాయి. 12వ తరగతి చదువుతున్న సాండ్రా రోజుకు 12 గంటల పాటు డయాలసిస్ పైనే ఉండాల్సిన పరిస్థితి. బయాప్సీలో కిడ్నీలు 70 శాతం పనిచేయడం లేదని గుర్తించారు. కిడ్నీ మార్పిడి వల్ల ప్రాణాలు నిలబడతాయని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం షార్జా అల్ ఖాసిమి ఆసుపత్రిలో సాండ్రా చికిత్స పొందుతున్నది.